వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ బలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:52 AM
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ ఒకరు బలయ్యారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అటవీ ప్రాం తంలో
![వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ బలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/2praveen_6c1ad51924.jpg)
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో దుర్ఘటన
కాటారం/హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ ఒకరు బలయ్యారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అటవీ ప్రాం తంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రాజోలుగూడకు చెంది న ఆడే ప్రవీణ్ (34)తో కూడిన 30 మంది గ్రేహౌండ్స్ బలగాల బృందం ఆదివారం రాత్రి కాటారం శివారులో కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో, నేలకు 2 అడుగుల ఎత్తులో సెంట్రింగ్ వైరుతో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు తాకిన ప్రవీణ్ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. చేతిపై వైరు లోతుగా దిగింది. వెంటనే తోటి పోలీసులు అంబులెన్స్లో తరలిస్తుండగానే ప్రవీణ్ మృతిచెందారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సుల్లో రానుండగా కాటారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ప్రవీణ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.