చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:40 PM
మత్స్యకారుల జీవనోపాధికి ఎప్పటి మాదిరిగానే వంద శాతం రాయితీపై చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనితో మత్స్యకారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
మత్య్సకారుల్తో చిగురిస్తున్న ఆశలు
మేడ్చల్ జూలై 19 (ఆంధ్రజ్యోతి ): మత్స్యకారుల జీవనోపాధికి ఎప్పటి మాదిరిగానే వంద శాతం రాయితీపై చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనితో మత్స్యకారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేది. జూలై నుంచి సెప్టెంబరు వరకు చెరువులు, కుంటల్లో నీటినిల్వ సామార్ధ్యాన్ని బట్టి చేప పిల్లలను వదులుతారు. అసెంబ్లీఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కొనసాగింపుపై స్పష్టత రాలేదు. దీంతో మత్స్యకారుల్లో సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఇటీవల చేపపిల్లల సరఫరాకు టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 23తో ప్రక్రియ పూర్తవుతుంది. చెరువులు, కుంటల్లోనీటి లభ్యతను బట్టి పంపిణీ చేస్తారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 82 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. వాటిలో 3,738 మంది సభ్యులున్నారు. 2023-24లో 68.5 లక్షల చేప పిల్లలు పంపిణీ జరిగింది. జిల్లాలో చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్లు లేకపోవడంతో ఏపీకి చెందిన కాంట్రాక్లర్లు ఏటా టెండర్లలో అవకాశం దక్కించుకుంటున్నారు. అయితే వీటిని ఆయా సంఘాలకు పంపిణీ చేయడంలో వ్యత్యాసం ఉంటుంది. దీనిపై గతంలో చాలా సార్లు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. నిర్ధేశించిన లక్ష్యానికి సరిపడా లేక తక్కువ సంఖ్యలో ఇస్తుండటంతో మత్య్సకారులు ఆందోళనకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. ఈసారైనా అధికారులు పక్కాగా చర్యలు చేపట్టి నాణ్యమైన చేప పిల్లల విత్తనం పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో ప్రస్తుతం నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఈ నెలలో భారీ వర్షాలు పడితే జలకళ సంతరించుకోనుంది. సగానికి పైగా నీరుంటేనే పంపిణీకి అవకాశం ఉంటుంది.