గొల్లుమన్న టంగటూరు
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:56 PM
అత్యాశ కుటుంబాలను నడిసంద్రంలో ముంచేస్తుంది. ఈజీ మనీ పేరుతో అనేక నకిలీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మధ్య తరగతి జీవులకు ఆశలు కల్పించి వారిని నట్టేట ముంచుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. కమీషన్ వస్తుందన్న ఆశతో న్ వసతమ బంధువులు, స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. కొంతకాలం ఈ వ్యవహారం సజావుగా సాగినా, తర్వాత అవాంతరాలు ఏర్పడుతున్నాయి. చివరకు ఆ సంస్థల చేతుల్లో మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక ఏజెంట్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆన్లైన్ మాయాజాలంలో పడొద్దని పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు తగడం లేదు. పైగా రోజురోజుకూ ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి.
నలుగురి ప్రాణాలు తీసిన ఆన్లైన్ ఈజీ మనీ
ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు కుమారులు బలి
పిల్లలకు ఉరివేసి తానూ ఉరి వేసుకున్న రవికుమార్
కుటుంబమంతా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు
ఆన్లైన్ ఈజీ మనీ సంస్థకు ఏజెంటుగా పనిచేసిన రవికుమార్
శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో జోరుగా ఆన్లైన్ మనీ పెట్టుబడులు
అత్యాశ కుటుంబాలను నడిసంద్రంలో ముంచేస్తుంది. ఈజీ మనీ పేరుతో అనేక నకిలీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మధ్య తరగతి జీవులకు ఆశలు కల్పించి వారిని నట్టేట ముంచుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. కమీషన్ వస్తుందన్న ఆశతో న్ వసతమ బంధువులు, స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. కొంతకాలం ఈ వ్యవహారం సజావుగా సాగినా, తర్వాత అవాంతరాలు ఏర్పడుతున్నాయి. చివరకు ఆ సంస్థల చేతుల్లో మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక ఏజెంట్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆన్లైన్ మాయాజాలంలో పడొద్దని పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు తగడం లేదు. పైగా రోజురోజుకూ ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి.
శంకర్పల్లి, ఫిబ్రవరి 4 : శంకర్పల్లి మండలం టంగటూరు గ్రామం ఒక్కసారిగా గొల్లుమని ఏడ్చింది. ఆన్లైన్ ఈజీ మనీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో గ్రామం ఉలిక్కిపడింది. ఆ ఇంటి ఎదుట ఉంచిన నలుగురి మృతదేహాలను చూసిన వారి కంట కన్నీరు ఆగడం లేదు. ఈజీ మనీ కోసం ఓ తండ్రి చేసిన వ్యవహారంలో అభం శుభం ఎరుగని ముగ్గురు చిన్నారులు కూడా బలి కావడంతో మృతుల బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. శంకర్పల్లి మండలం టంగటూర్ గ్రామానికి చెందిన నీరటి రవికుమార్ కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో అతడి జీవితంలోకి గుంటూరు నగరానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అతడు ఓ జీఎస్ఎన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలో రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. నెలకు రూ. 50 వేల చొప్పున 10 నెలల పాటు ఇస్తామని ఆశ చూపాడు. దీంతో తనకు కమీషన్ ఎక్కువగా వస్తుందని భావించిన రవికుమార్ ఆ సంస్థలో ఏజెంటుగా చేరాడు. శంకర్పల్లి మండలంలోని టంగటూరు, మోకిల, బుల్కాపూర్, మహలింగపూర్, శంకర్పల్లి, సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం, జుకల్ గ్రామస్తుల నుంచి కూడా ఈ ఏజెన్సీలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టించాడు. రెండు సంవత్సరాల క్రితం వరకు ఈ వ్యాపారం సాఫీగానే కొనసాగింది. అయితే, మూడు నెలల నుండి కట్టిన డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు రవికుమార్పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో తాను డబ్బులు కట్టించిన సంస్థ మోసం చేసిందని గ్రహించిన రవికుమార్ మనో వేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే రవికుమార్కు అతడి భార్యకు మధ్య ఆదివారం ఉదయం గొడవ జరిగింది. దీంతో తాను బతికి వృథా అని భావించిన రవికుమార్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వారేమి చేశారు నేరం!
రవికుమార్కు ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సాయికిరణ్ (13), రెండో కుమారుడు మోహిత్కుమార్ (10), మూడో కుమారుడు ఉదయ్కుమార్ (07). వీరిలో మొదటి, రెండో కుమారులు మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. చిన్న కుమారుడు నాయనమ్మతో పాటు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన రవికుమార్ ఆదివారం సాయంత్రం హాస్టల్కు వెళ్లి ఇ్దరు పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు పిల్లలకు ఇంట్లోనే ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత నైలాన్ తాడుతో ఉరివేశాడు. అనంతరం తాను కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. అయితే, ఆన్లైన్ సంస్థ మోసానికి.. ఈ ముగ్గురు చిన్నారులకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆ చిన్నారుల జీవితం ఇలా ముగిసిపోయిందే అంటూ గ్రామస్తులు గుండెలు బాదుకుంటున్నారు. అయితే, రవికుమార్తో గొడవ పెట్టుకొని ఆదివారం ఉదయం పుట్టింటికి వెళ్లడంతో రవికుమార్ భార్య లత ప్రమాదం నుంచి బయటపడిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.