Share News

కర్మకాండకు వెళుతూ అనంత లోకాలకు..

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:29 PM

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. బంధువుల ఇంట్లో కర్మకాండకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.

కర్మకాండకు వెళుతూ అనంత లోకాలకు..

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ద్విచక్రవాహనం

అక్కడికక్కడే మృతిచెందిన భార్యాభర్తలు

రంగారెడ్డి జిల్లా కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన

కొడంగల్‌ రూరల్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. బంధువుల ఇంట్లో కర్మకాండకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బషీరాబాద్‌ మండలం దామర్‌చెడ్‌ గ్రామానికి చెందిన కుమ్మరి శివాజి (40), అనిత (38) భార్యాభర్తలు. చేవెళ్ల మండలంలోని కుప్పగిరి గ్రామంలో బంధువుల ఇంట్లో శనివారం కర్మకాండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై ఆలూరు నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో కొడంగల్‌ మండలంలోని చిట్లపల్లి గేటు దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను బైక్‌ వెనకనుంచి ఢీకొట్టడంతో భార్యాభర్తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు మృతదేహాలను కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, వారికి నలుగురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. శివాజి సోదరుడు సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 11:29 PM