గ్యాస్ సిలిండర్ లీకేజీ : మంటలతో ఇల్లు దగ్ధం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:05 AM
దేవరకొండ పట్టణంలోని అయ్యప్పనగర్లో కేతావత్ నిమ్మానాయక్ ఇంట్లో వంట గ్యాస్ లీకేజీతో మంగళవారం మంటలు చెలరేగాయి.
![గ్యాస్ సిలిండర్ లీకేజీ : మంటలతో ఇల్లు దగ్ధం](https://media.andhrajyothy.com/media/2024/20240326/2dvkp4_7db0a189e1.jpg)
దేవరకొండ, ఏప్రిల్ 2: దేవరకొండ పట్టణంలోని అయ్యప్పనగర్లో కేతావత్ నిమ్మానాయక్ ఇంట్లో వంట గ్యాస్ లీకేజీతో మంగళవారం మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లు దగ్ధమై రూ.15లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినల్లు బాధితుడు తెలిపారు. బాధితుడు నిమ్మానాయక్, దేవరకొండ అగ్నిమాపక అధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం నిమ్మానాయక్ భార్య జ్యోతి వంట గ్యాస్ సిలిండర్ను ఆన్చేసి లైటర్తో వెలిగించే ప్రయత్నం చేసింది. లైటర్ రెండు, మూడు సార్లు చేసినప్పటికీ మంట రాకపోవడంతో సిలిండర్లో గ్యాస్ అయిపోయిందని అలాగే వదిలేసి బయటకు వచ్చింది. బయట వరండాలో ఉన్న భర్త నిమ్మానాయక్ మరోసారి సిలిండర్ను చూడమని చెప్పడంతో జ్యోతి సిలిండర్ వద్దకు వచ్చి లైట్ వేసింది. అప్పటికే సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అవుతుండడంతో ఒకేసారి ఇంట్లో మంటలు అంటుకున్నాయి. భయాందోళనకు గురైన జ్యోతి, నిమ్మానాయక్ బయటకు పరుగులు తీయడంతో ప్రాణపాయం తప్పింది. మంటలలో బట్టలతోపాటు విద్యుత్ వైర్లు, కబోడ్లు, సామాగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నిమ్మానాయక్ ఫిబ్రవరి నెలలో నూతనంగా గృహ ప్రవేశం చేశారు.