Share News

రాష్ట్ర పోలీసుల చేతికి గరుడాస్త్రం!

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:32 AM

పూర్వం లేఖలను పంపడానికి పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించడం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం..! విన్నాం..

రాష్ట్ర పోలీసుల చేతికి గరుడాస్త్రం!

మొయినాబాద్‌లో డేగలకు ప్రత్యేక శిక్షణ

అడవుల్లో మావోయిస్టుల గుర్తింపులో వినియోగం

అనధికారిక డ్రోన్లపైనా నిఘాకు చాన్స్‌

ఆ డ్రోన్లను మోసుకొచ్చేలా డేగలకు తర్ఫీదు

త్వరలో ఐఎస్‌డబ్ల్యూలో విధుల్లోకి మూడు డేగలు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పూర్వం లేఖలను పంపడానికి పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించడం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం..! విన్నాం..! అయితే.. రాష్ట్రంలో అత్యున్నత నిఘా/భద్రత సంస్థ-- ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌(ఐఎ్‌సడబ్ల్యూ) కొత్తగా ‘గరుడ’ దళాన్ని నియమించనుంది. ఇప్పటికే అశ్విక దళం, డాగ్‌స్క్వాడ్‌ ఐఎ్‌సడబ్ల్యూలో ఉండగా.. త్వరలో నిఘా డేగలు కూడా సేవలు అందించనున్నాయి. నెదర్లాండ్స్‌ వంటి పలు దేశాల సైన్యం డేగలను నిఘాకు వినియోగిస్తున్నాయి. మరికొన్ని దేశాలు అందుకు పావురాల సేవలను ఉపయోగించుకుంటున్నాయి. అయితే.. రాష్ట్ర పోలీసులు మొట్టమొదటి సారిగా డేగల సేనను సిద్ధం చేస్తున్నాయి. వీటికి గరుడ దళం అని నామకరణం చేశాయి. తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించారు. అయితే.. పావురాలు ప్రతికూల వాతావరణంలో పనిచేయలేవు. డేగలు తుపాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. దీంతో.. నల్లమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న మూడు డేగ పిల్లలను తీసుకువచ్చారు. మూడేళ్లుగా వాటికి మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఐఐటీఏ)లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఈ అకాడమీలో జాగిలాలు, అశ్విక దళాలకు శిక్షణనిస్తుంటారు. తొలిసారిగా డేగలకు శిక్షణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో వీటి శిక్షణ ముగుస్తుందని, ఆ వెంటనే విధుల్లో చేరుతాయని వివరించారు. డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల డేగల శిక్షణ పనితీరును పరిశీలించారు. ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలున్నట్లు గుర్తించారు.

ఈ పనులు ఇక సులభం..!

అడవుల్లో నక్కి ఉండే ఉగ్రవాదులు, మావోయిస్టులను డేగలు సులభంగా గుర్తించగలవు.

మావోయిస్టుల కట్టడికి డేగలను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. పైగా.. కూంబింగ్‌ దళాలకు డేగల నిఘా అదనపు బలాన్ని చేకూరుస్తుంది.

తమ సమాచారాన్ని పోలీసులకు అందించే ఇన్ఫార్మర్లను మావోయిస్టుల గుర్తించి, హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డేగల నిఘాను ముమ్మరం చేయడం వల్ల ఆ ఇబ్బందులను దూరం చేయవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది.

సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా డేగలకు శిక్షణనిస్తున్నారు. డేగలు రెండు కిలోల దాకా బరువును కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు. డ్రోన్లను కూడా ఇవి ఒడిసిపట్టి.. పోలీసులకు అందజేస్తాయి.

ప్రధాని, ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరీ.. ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే.. వాటిని పట్టుకొచ్చి, అధికారులకు అప్పగిస్తాయి.

డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత, అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్‌ చేసే అవకాశాలుంటాయి.

Updated Date - Mar 14 , 2024 | 05:33 AM