అసెంబ్లీకి దోస్తీ.. పార్లమెంట్కు కుస్తీ?
ABN , Publish Date - Mar 27 , 2024 | 04:25 AM
అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ కట్టిన కాంగ్రెస్... వామపక్షాలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ స్థానాల విషయంలో కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే సీపీఎం తాము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం.. పొత్తు ఉంటుందో లేదో కాంగ్రెస్ తేల్చుకోవాలని ప్రకటించింది. సీపీఐ ఇప్పటికీ పొత్తు ధర్మాన్ని
![అసెంబ్లీకి దోస్తీ.. పార్లమెంట్కు కుస్తీ?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వామపక్షాలకు అందని స్నేహ ‘హస్తం’
ఈ నెల 30న తేల్చేస్తామంటున్న సీపీఐ
2 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ కట్టిన కాంగ్రెస్... వామపక్షాలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ స్థానాల విషయంలో కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే సీపీఎం తాము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం.. పొత్తు ఉంటుందో లేదో కాంగ్రెస్ తేల్చుకోవాలని ప్రకటించింది. సీపీఐ ఇప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటిద్దామంటూ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతోంది. తాము ఐదు స్థానాల్లో బలంగా ఉన్నామని, వాటిలో ఒకటి తమకు కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదు. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్... ఈ స్థానాల్లో ఏదో ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ నేతలు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో కలిసి వెళ్లి.. కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తమ ప్రతిపాదనలను వివరించారు. రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకుని మీరే నిర్ణయం తీసుకోండని ఢిల్లీ పెద్దలు చెప్పడంతో.. సీట్ల పంచాయతీ మళ్లీ రాష్ట్ర నాయకత్వం వద్దకే వచ్చింది. తమ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ నుంచిస్పందన లేకపోవడంతో సీపీఐ నాయకులు 30న లోక్సభ సీట్ల సర్దుబాటు, పొత్తులపై కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా హాజరవుతున్నారు. ఆ రోజు కాంగ్రె్సతో కలిసి వెళ్లడమా లేక సొంతంగా పోటీకి దిగడమా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీపీఐ నాయకులు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి దిగితే.. సీపీఐ, సీపీఎం రెండూ తమ అభ్యర్థులను బరిలో దింపేలా సన్నాహాలు చేస్తున్నాయి.