నిధులు ఫ్రీజింగ్.. నిలిచిన ఫాగింగ్
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:49 PM
: దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన గ్రామపంచాయతీలు నిధుల లేమితో చోద్యం చూస్తున్నాయి.
దోమల మందు పిచికారీకి డబ్బులు కొరత
దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నార్కట్పల్లి, ఏప్రిల్ 7: దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన గ్రామపంచాయతీలు నిధుల లేమితో చోద్యం చూస్తున్నాయి. అసలే వేసవి కాలం ఆపై ఎండలు మండిపో తుండటంతో రాత్రివేళ ఇంటి బయట ఆవరణలో నిద్రించాలనుకునే వారికి దోమల బెడద నిద్రపట్టకుండా చేస్తోంది. దోమల నివారణకు చేయాల్సిన ఫాగింగ్కు నిధుల ఫ్రీజింగ్ అవరోధంగా మారిందని తెలుస్తోంది. మాడ్గుల పల్లి మండలంలో ఇటీవల అంతుచిక్కని వ్యాధి బారిన పడి గ్రామస్థులంతా అనారోగ్యానికి గురయ్యారు. నీటికలుషితం వల్ల అయ్యిందా..? లేక దోమకాటు వల్ల ప్రబలిందా..? అనేది ఇంకా నిర్థారణ కాలేదు. కానీ బాధిత గ్రామస్థులు మాత్రం అంతుచిక్కని వ్యాధి బారిన పడి ఒళ్లంతా నొప్పులతో కొన్ని రోజుల పాటు అవస్థలు పడ్డారు. ప్రజారోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిం చి బాధిత గ్రామస్థులకు చికిత్స అందించింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసు కోవాలని జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులకు సూచిం చింది. నిధులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ పంచాయతీలు నివారణ చర్యలను వేగవంతం చేయలేకపోతున్నాయి.
డబ్బులు లేక ఆగిన ఫాగింగ్
ప్రస్తుతం గ్రామ పంచాయతీల నిధులు నీటి అవసరాలకే తప్ప ఇతరత్రా ఉపయోగించడానికి అనుమతి లేదు. దీంతో ఫాగింగ్ చేయడానికి గ్రామ పంచాయతీలకు నిధులు అందుబాటులో లేవని తెలుస్తోంది. నిధులు డ్రా చేయకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించడంతో అత్యవసర పనులే తప్ప మరే ఇతర పనులకు నిధులు అందు బాటులో లేవని తెలుస్తోంది. ఉదాహరణకు నార్కట్పల్లి పట్టణంలో ఫాగింగ్ చేయాలంటే కనీసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు రావడంతో ఎల్బీనగర్ నుంచి ఫాగింగ్ చేసే వ్యక్తులను ప్రత్యేకంగా పిలిపించి చేయాల్సి ఉంది. ఫాగింగ్ చేసినందుకు వీరికి సుమారు రూ.10వేలు, డీజిల్, కెమికల్, పెట్రోల్ వాడకానికి మారో రూ.15వేలు వెచ్చించాల్సి ఉంది. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఫాగింగ్ చేయలేకపోతున్నట్లు తెలిసింది.
దోమల బెడదను నివారించాలి
నార్కట్పల్లిలో దోమల బెడద విపరీతంగా పెరిగింది. రాత్రివేళ కరెంటు సరఫరాలో అంతరాయమేర్పడినపుడు ఆరుబయట నిద్రించాలనుకుంటే దోమలు కాటేస్తున్నాయి. బయటకు వస్తే దోమలతో ఇబ్బంది పడుతున్నాం.
చొల్లేటి ఓం ప్రకాశ్, నార్కట్పల్లి.
రెండు రోజుల్లో ఫాగింగ్ చేయిస్తాం
దోమల బెదడ నివారణకు చర్యలు చేపడతాం. రెండు రోజుల్లో ఫాగింగ్ చేయిస్తాం. ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వేసవి కారణంగా ప్రస్తుతం నిధులు అత్యవసరంగా నీటి అవసరాలు తీర్చేవాటికి విని యోగించాల్సి ఉంది. అధికారుల అనుమతితో ఫాగింగ్ చేయిస్తాం.
సుధాకర్, ఎంపీవో.