మన్నెగూడ - తాండూరుకు నాలుగు లేన్ల రోడ్డు
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:38 PM
వికారాబాద్ జిల్లా మన్నెగూడ నుంచి తాండూరు వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి తాజాగా ప్రతిపాదనలు పంపించింది.
![మన్నెగూడ - తాండూరుకు నాలుగు లేన్ల రోడ్డు](https://media.andhrajyothy.com/media/2023/20231205/3_TDR_03_e1d3c7d5ae.jpg)
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు
బూత్పూర్ నుంచి వయా కొడంగల్, తాండూరు మీదుగా ఎన్హెచ్ పనులు
తాండూరు :జనవరి 3 : వికారాబాద్ జిల్లా మన్నెగూడ నుంచి తాండూరు వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి తాజాగా ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోడ్లను 4లేన్ రోడ్లుగా విస్తరించేందుకు గాను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించగా అందులో మన్నెగూడ నుంచి తాండూరు వరకు ఉంది. మహబూబ్నగర్ బూత్పూర్ నుంచి వయా కోడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించోలి వరకు జాతీయ రహదారులు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రూ. 1,336 కోట్లతో పనులు చేపట్టింది. 167 ఎన్హెచ్గా నామకరణం చేసి 102 కిలో మీటర్ల మేరకు ఈ రహదారిని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే మన్నెగూడ నుంచి వయా తాండూరు మీదుగా జహీరాబాద్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాల్సి ఉంది. మన్నెగూడ నుంచి తాండూరుకు 50 కిలో మీటర్ల దూరం అవుతుంది. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో పాటు ఈప్రాంత అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నేషన్హైవే అథారటి అధికారులను కలిసి నాలుగు లేన్ల రోడ్డు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం నుంచి అప్రోల్ రావల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.