Share News

జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:40 AM

రోడ్డు వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడులతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికొకరు తలలు పగిలేలా కొట్టుకున్న ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మిర్జాగూడ గేటు నుంచి జన్వాడ గ్రామం వరకు

జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

రోడ్డు వివాదంలో ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు

దళితులకు మద్దతుగా ప్రవీణ్‌కుమార్‌ నిరసన.. అరెస్టు

ఈ నెల 21 వరకు 144 సెక్షన్‌

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి) : రోడ్డు వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడులతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికొకరు తలలు పగిలేలా కొట్టుకున్న ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మిర్జాగూడ గేటు నుంచి జన్వాడ గ్రామం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే, గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో క్రైస్తవుల ప్రార్థన మందిరానికి ఆనుకుని రోడ్డు వేయెద్దని కొంతమంది యువకులు గ్రామస్థులతో గొడవకు దిగారు. దాంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గ్రామానికి చేరుకుని దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేయడంతో ఓ దళిత కార్యకర్త హై టెన్షన్‌ విద్యుత్‌ స్తంభం ఎక్కి ప్రవీణ్‌ను విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాడు. మరోవైపు, జన్వాడలో ఫిబ్రవరి 21 వరకు 144 సెక్షన్‌ విధిస్తునట్లు సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 03:40 AM