సీఎం సభా ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:45 PM
ఈనెల 9న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ లో సీఎం సభా ఏర్పాట్లను కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించారు. ఐటీ టవర్ ప్రాంతంలో డ్వాక్రా మహిళలతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

మేడ్చల్టౌన్, మార్చి 6: ఈనెల 9న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ లో సీఎం సభా ఏర్పాట్లను కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించారు. ఐటీ టవర్ ప్రాంతంలో డ్వాక్రా మహిళలతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గంలోని మండలాలతో పాటు మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వేదిక ఏర్పాటు బాధ్యతను రెవెన్యూ అధికారులకు ఇవ్వగా, సభ నిర్వహణ బాధ్యతలను మెప్నా, మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించాలని సూచించారు. దీనికి తోడు భద్రతా ఏర్పాట్లతో పాటు వాహనాల పార్కింగ్, వీఐపీల గ్యాలరీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభా సమయం ఖరారు కాగానే అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను వేగంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.