ప్రఖ్యాత సంస్కృతాంధ్ర పండితుడు అయాచితం నటేశ్వర శర్మ ఇకలేరు
ABN , Publish Date - Sep 11 , 2024 | 05:01 AM
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత, కవి, అవధాన ఘనాపాఠి, విశ్రాంత ఆచార్యుడు అయాచితం నటేశ్వరశర్మ (68) ఇకలేరు. కొంతకాలంగా కాలేయ కేన్సర్తో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం బోయిన్పల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి తిగుళ్ళ అరుణ కుమారి ప్రభుత్వ
కేన్సర్తో బాధపడుతూ కన్నుమూత
125కుపైగా అష్టావధానాలు, శతావధానాలు
60కి పైగా పుస్తకాల సంకలనం
నేడు బోయిన్పల్లిలో అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ, కామారెడ్డి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత, కవి, అవధాన ఘనాపాఠి, విశ్రాంత ఆచార్యుడు అయాచితం నటేశ్వరశర్మ (68) ఇకలేరు. కొంతకాలంగా కాలేయ కేన్సర్తో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం బోయిన్పల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి తిగుళ్ళ అరుణ కుమారి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ దంపతులకుకౌముది, జాహ్నవి యామిని కుమార్తెలు. నటేశ్వర శర్మ స్వస్థలం కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామం. ఆయన తండ్రి అనంతరాజ శర్మ.. కుమారుడిని సంస్కృత విద్వాంసుడిగా చూడాలన్న ఆశయంతో ఆరో తరగతి పూర్తయ్యాక నటేశ్వర శర్మను తిరుమలలోని సంస్కృత పాఠశాలలో చేర్పించారు. అక్కడ అధ్యయనం సాగిస్తున్న సమయంలోనే అనుష్టుప్ ఛందస్సులో శ్లోకాలు రాసేవారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించి ‘వ్యాకరణ శిరోమణి’ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో బీవోఎల్.. తెలుగు, సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ‘ఆముక్త మాల్యద కావ్యం’పై ఎం.ఫిల్, ‘శంకర భాగవత్పాద కృత సౌందర్యలహరి’పై పీహెచ్డీ పరిశోధన చేసి బంగారు పతకం అందుకున్నారు. కామారెడ్డిలోని ప్రాకృత విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1977లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన నటేశ్వర శర్మ 2014లో అదే కళాశాల ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ పొందారు. తెలుగు, సంస్కృతాల్లో 125కుపైగా అష్టావధానాలు,శతావధానాలు చేశారు. సంస్కృతాంధ్ర భాషల్లో 60కుపైగా పుస్తకాలు రాశారు. వాటిల్లో ‘బాల రామాయణం’, ‘సమయవిలాసిని’, ‘శకుంతల’, ‘రుతుగీత’, ‘నవ్యగీతి’, ‘భారతీప్రశస్తి’, ‘ఆముక్తమాల్యద పరిశీలనము’, ‘వసంతకుమారి’, ‘శ్రీషోడశీ’, ‘చుక్కలు’, తదితర రచనలున్నాయి. ఆయన సాహిత్య సేవను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో సత్కరించింది. ‘శకుంతల’ పద్య కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కావ్య పురస్కారం, ‘భారతీ ప్రశస్తి’కి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం లభించాయి. సినారె రచించిన ‘రామప్ప’ సంగీత, నృత్యరూపకాన్ని నటేశ్వర శర్మ సంస్కృతంలోకి అనువదించారు. కాగా బుధవారం మధ్యాహ్నం బోయిన్పల్లి, టీచర్స్ కాలనీలోని స్వర్గవాటికలో అంత్యక్రియలు జరగనున్నట్లు శర్మ పెద్ద కుమార్తె కౌముది తెలిపారు. నటేశ్వర శర్మ మృతికి నందినిసిధారెడ్డి, రమణాచారి, మోత్కూరి నరహరి, గఫూర్ శిక్షక్, ఆచార్య జయధీర్ తిరుమలరావు సంతాపం వ్యక్తం చేశారు.