Share News

పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:38 AM

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కసరత్తు చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అన్ని రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీఐ ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,150 మంది (900 మంది జనరల్‌

పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలి

పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలి

ఈసీఐ ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌

ఐఏఎస్‌, ఐపీఎ్‌సలతో ప్రత్యేక సమావేశం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కసరత్తు చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అన్ని రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీఐ ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,150 మంది (900 మంది జనరల్‌ పరిశీలకులు, 450 మంది పోలీస్‌ పరిశీలకులు, 800 మంది వ్యయ పరిశీలకులు) ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు పర్చాలని రాజీవ్‌ కుమార్‌ సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు పరిశీలకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అధికారులు తమకు కేటాయించిన నియోజకవర్గంలో మాత్రమే పర్యటించాలని పేర్కొన్నారు.స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రశాంత వాతారవణాన్ని నెలకొల్పాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా దేశవ్యాప్తంగా 96కోట్ల మంది ఓటర్లు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికా్‌సరాజ్‌, ఇతర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాలకు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 07:47 AM