రూ.3వేల కోట్లతో వికారాబాద్ అభివృద్ధి
ABN , Publish Date - Jan 02 , 2024 | 11:03 PM
వచ్చే ఐదేళ్లలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, జనవరి 2 : వచ్చే ఐదేళ్లలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్లుగా జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, రాబోవు రోజులలో నియోజకవర్గ ప్రజలందరికీ అన్నలా ఉండి జిల్లాను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని రోడ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరుస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు. ఆరు గ్యారంటీల అమలులో అధికారులు అవినీతికి పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల , వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వికారాబాద్ నియోజకవర్గ ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.