కేసీఆర్ పాలనలో పంచాయతీరాజ్ విధ్వంసం
ABN , Publish Date - Feb 01 , 2024 | 03:46 AM
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ విధ్వంసమైందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన
![కేసీఆర్ పాలనలో పంచాయతీరాజ్ విధ్వంసం](https://media.andhrajyothy.com/media/2023/20231205/dd_18da1be382.jpg)
కేంద్రం నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లించింది
సర్పంచ్ల పదవీకాలాన్ని పొడిగించాలి: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ విధ్వంసమైందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన కేసీఆర్ సర్కార్ దారిమళ్లించిందని ఆరోపించారు. బుధవారంతో తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించేవరకు ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అధికారులతో పాలనకు రేవంత్ సర్కారు ప్రణాళిక చేస్తోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. 73వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని చెప్పారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రామసభలు పెట్టి ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్పారని, సర్పంచ్లు లేకుంటే గ్రామసభలు నిర్వహిస్తారా? లబ్ధిదారులను ఎంపిక చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సర్పంచ్లే లేకుంటే లబ్ధిదారుల ఎంపిక జరగదని, అప్పుడు పథకాలను అమలుచేయాల్సిన అవసరం ఉండదన్నారు. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకెళ్తామని, పకడ్బందీగా బీజేపీ ప్రచారం ఉండబోతోందని ఆయన చెప్పారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఎండీ, అమెరికన్ బ్యాంకు మాజీ ఉద్యోగి సుధాకర్, వ్యాపారవేత్త వినోద్ రావు, సైంటిస్ట్ ఎల్లారెడ్డి.. కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.