Share News

కరెంట్‌ చార్జీలను పెంచాల్సిందే!

ABN , Publish Date - Jan 12 , 2024 | 06:00 AM

డిస్కమ్‌లు విద్యుత్తును సరఫరా చేసేందుకు వెచ్చించే మొత్తం వ్యయాన్ని బిల్లుల రూపంలో వినియోగదారుల నుంచి రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

కరెంట్‌ చార్జీలను పెంచాల్సిందే!

ఆదాయ అవసరాలు, టారిఫ్‌ మధ్య వ్యత్యాసం వద్దు

తప్పనిసరైతే.. 3 శాతానికి మించి ఉండొద్దు

ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై చార్జీల బాదుడు వద్దు

స్పష్టం చేస్తున్న ఎలక్ట్రిసిటీ (సవరణ)-2024 నిబంధనలు

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌లు విద్యుత్తును సరఫరా చేసేందుకు వెచ్చించే మొత్తం వ్యయాన్ని బిల్లుల రూపంలో వినియోగదారుల నుంచి రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌-- ఎలక్ట్రిసిటీ(సవరణ) నిబంధనలు-2024 బుధవారం విడుదలైంది. డిస్కమ్‌లు మొత్తం వ్యయాన్ని రాబట్టుకునేలా కరెంటు చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘డిస్కమ్‌లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను నవంబరులోగా రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించాలి. వాటిని ఈఆర్సీ పరిశీలించి, ఆదాయ అవసరాల మొత్తాలను ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్తు చార్జీలను సైతం తదుపరి ఆర్థిక సంవత్సర ఆరంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాలి’’ అని ఆనిబంధనలు పేర్కొంటున్నాయి. ఇకపై ఈఆ ర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారీ్‌ఫతో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని స్పష్టం చేసింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వ్యత్యాసం ఉంటే.. అది 3శాతానికి మించకూడదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇక గడువులోగా బిల్లులు చెల్లించని వారికి విధించే ‘లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ’తో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి, రాబోయే మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ గెజిట్‌ అమల్లోకి రాకముందు ఉన్న ఆదాయ వ్యత్యాసాలు, లేట్‌పేమెంట్‌ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో వసూలు చేసుకోవాలని సూచించింది.

ట్రాన్స్‌మిషన్‌ లైన్లకు లైసెన్స్‌ అక్కర్లేదు

ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్‌ విద్యుత్తు ప్లాంట్‌/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ఏర్పాటు, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ప్రత్యేకంగా లైసెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా సవరణలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోపు ఉండాలి. దీర్ఘకాలిక ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే.. స్వల్ప కాలిక ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులకు 110శాతానికి మించి ఉండరాదని తాజా సవరణలు చెబుతున్నాయి. అన్ని రకాల ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్తుకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ ధరలకు మించకుండా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Jan 12 , 2024 | 06:00 AM