సూర్యాపేటలో కౌన్సిలర్ల ఫైటింగ్
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:47 AM
మునిసిపల్ చైర్ పర్సన్ను దించేసేందుకు సూర్యాపేట బల్దియాలో ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రం అగ్గి రాజేసింది.
నడి రోడ్డుపై ప్రజా ప్రతినిధుల తన్నులాట..
అవిశ్వాసానికి మద్దతిచ్చి వెనక్కి తగ్గిన నేత
ఆమె ఇంటి వద్ద అసమ్మతి కౌన్సిలర్ల రచ్చ
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్కు గాయం
సుమారు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత
సూర్యాపేట టౌన్, జనవరి 28: మునిసిపల్ చైర్ పర్సన్ను దించేసేందుకు సూర్యాపేట బల్దియాలో ప్రయోగించిన అవిశ్వాస తీర్మాన అస్త్రం అగ్గి రాజేసింది. తీర్మానంపై సంతకం చేసిన ఓ కౌన్సిలర్.. తీరా సమయానికి వెనక్కి తగ్గడంతో.. అసమ్మతి కౌన్సిలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో వారంతా ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగడం.. ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు రావడంతో.. ఇరు వర్గాల మధ్య రెండు గంటల పాటు ఘర్షణ జరిగింది. సూర్యాపేట మునిసిపాలిటీలో చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిధుల కేటాయింపులో వివక్ష, వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తూ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టాలని 32 మంది కౌన్సిలర్లు ఈ నెల 10న నోటీసులు అందజేశారు. దీంతో ఈ నెల 27న అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని మూడు నెలల క్రితం బీఆర్ఎస్ నుంచి బీఎస్పీలోకి చేరారు. ఆమె కూడా అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తూ 15 రోజుల పాటు క్యాంపులో పాల్గొన్నారు. తర్వాత వెనక్కి తగ్గి ఆమె క్యాంపు నుంచి వచ్చారు. అవిశ్వాసానికి సరిగ్గా 32 మంది మద్దతు కావాలి. పావని వెనక్కి తగ్గడంతో అవిశ్వాసం వీగిపోతుందని గ్రహించి.. అసమ్మతి కౌన్సిలర్లలో ఒక్కరు కూడా అవిశ్వాస సమావేశానికి హాజరుకాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.
కౌన్సిలర్ తలకు గాయం..
పావని ఇంటి ఎదుట అసమ్మతి కౌన్సిలర్లు ఆదివారం ఆందోళన చేశారు. ఇంట్లోకి కోడి గుడ్లు విసిరి మట్టిని చల్లారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని అసమ్మతి కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్కు.. అసమ్మతి కౌన్సిలర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి నిఖిల తలకు గాయమై రక్తస్రావమవుతున్నందున అక్కడే కూర్చుండిపోయారు. ఆమెతో పాటు అసమ్మతి కౌన్సిలర్లు ఆందోళన కొనసాగించారు. సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఒక వర్గం.. కాంగ్రెస్ కౌన్సిలర్లు, తిరుగుబాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరో వర్గంగా ఏర్పడి దాడులు చేసుకున్నారు. కాగా, బహుజనులకు రాజ్యాధికారం కోసమే అవిశ్వాసంపై వెనక్కి తగ్గానని కౌన్సిలర్ పావని అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం ఇటీవల బీఎస్పీలో చేరానని, త్వరలో బీఆర్ఎ్సలో చేరతానని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.