కాంగ్రెస్ జాతీయ గ్యారెంటీకార్డు పేదలకు వరం
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:51 PM
కాంగ్రెస్ జాతీయ గ్యారెంటీ కార్డు పేదలకు వరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.
మిర్యాలగూడ, ఏప్రిల్ 7: కాంగ్రెస్ జాతీయ గ్యారెంటీ కార్డు పేదలకు వరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఆర్య సమాజ్మందిర్లో సమాచారహక్కు సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పేదల సంక్షేమానికి తోడ్పడింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. సంక్షేమ పథకాలు, పాలనలో జవాబుదారితనం కల్పించి పారదర్శకంగా ఉండేందుకు దేశంలో సమాచారహక్కు చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. నెహ్రూ పాలనలో దేశ ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు రచిస్తే, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణతో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాజీవ్గాంధీ దేశానికి తొలిగా టెక్నాలజీని పరిచయం చేశారన్నారు. ప్రజా సంక్షేమం కోసం సాహోసపేత నిర్ణయం, దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను దేశ ప్రజలు మరవులేరన్నారు. దేశంలో బహుళ జాతుల సంస్కృతీ, లౌకికవాదం, సమానత్వం రక్షించాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఆర్టీఐ చట్టం సామాన్యులకు గౌరవం పెంచిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను త్వరలో నియమిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం హర్షనీయమన్నారు. సహ చట్టం ద్వారా అవినీతిని వెలికితీయాలన్నారు. ఆర్టీఐ కార్యకర్తలు, మేధావులు, విద్యావంతులు ముందడుగు వేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలు అభినందనీయమ న్నారు. సమాచార వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం. రామ్చంద్రారెడ్డి, ఎండి.ఖలీమ్, చిత్రం శ్రీనివాస్, ఎం. సతీష్కుమార్, వై.హేమలత, మూల శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.