Share News

బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:46 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలు

ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి

మోదీని ఎదుర్కొనేది ప్రాంతీయ పార్టీలే

మంత్రివర్గంలో మైనారిటీలు ఏరీ?: కేటీఆర్‌

ఆటోడ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు

తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణం

యూసు్‌ఫగూడ/హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆ రెండు పార్టీలు అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ తరఫున డమ్మీ అభ్యర్థులను నిలిపి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు లబ్ధి చేకూర్చేలా బీజేపీ పనిచేసిందని తెలిపారు. శనివారం యూసు్‌ఫగూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు హామీలు నెరవేర్చమంటే బీఆర్‌ఎస్‌ పార్టీని తిట్టే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ముందు అదానీని తిట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే దావోస్‌ వెళ్లి ఆయనతో ఒప్పందాలు చేసుకొని వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర అని తిరుగుతుంటే.. ఆ పార్టీ మిత్రపక్షాలు రాహుల్‌ ఛోడో అంటూ వదిలి వెళ్తున్నాయని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు వదిలి వెళ్తున్నాయని, ఆ కూటమిలో మిగిలేది చివరికి రాహుల్‌ గాంధీ ఒక్కరేనని అన్నారు.

మోదీని అడ్డుకోవడం కాంగ్రెస్‌ వల్లకాదు..

ఢిల్లీలో ప్రధాని మోదీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీతో కాదని కేటీఆర్‌ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక.. మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ ఇప్పటికే చేతులెత్తేసిందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, బిహార్‌లో నితీశ్‌కుమార్‌, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీలాగే తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ గట్టిగా ఎదురునిలిచి పోరాడితేనే మోదీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలనా పరమైన కారణాలు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రూ.2500ను పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం కల్పించడంలేదన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ మైనారిటీ విభాగం సమావేశంలో పార్టీ శ్రేణులనుద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలిపినందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షబ్బీర్‌ అలీకి సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇది మైనారిటీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. కాగా, అధికారం ఎవరి సొత్తూ కాదని, శాశ్వతం కాని అధికార అహంకారాన్ని సీఎం రేవంత్‌ నరనరాన ఎక్కించుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, భిక్షమయ్యగౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

హామీలు నెరవేర్చేదాకా పోరు: హరీశ్‌

సిద్దిపేట టౌన్‌, జనవరి 27: అధికారంలోకి వచ్చిన వెంటనే పలు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఆ విషయంలో విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. డిసెంబరు 9న రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి, ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. హామీలను ఎలా ఎగ్గొట్టాలని కాంగ్రెస్‌ నేతలు ఆలోచిస్తున్నారని.. అందుకే అప్పులు, లంకె బిందెలంటూ సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ సర్కారు వెంట పడతామని చెప్పారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సిద్దిపేట నియోజకవర్గ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చేలోపు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్‌ అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు..

ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ఆటోలో ప్రయాణించారు. మహిళలకు ఉచిత బస్సుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు కేటీఆర్‌కు చెప్పడంతో.. వారి సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి యూసు్‌ఫగూడ నుంచి బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. కాగా, ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయింబర్స్‌ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెస్తామని కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Jan 28 , 2024 | 03:46 AM