సచివాలయంలో సామాన్యుల సందడి
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:54 AM
కాంగ్రెస్ సర్కారు వచ్చాక సచివాలయంలో సామాన్యుల సందడి పెరిగిపోయింది. కొత్త సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి గతేడాది డిసెంబరు 7 వరకు పెద్దగా జన సంచారం ఉండేది కాదు.
నిత్యం వందల సంఖ్యలో అర్జీదారులు
నాడు వెల వెల.. నేడు కళ కళ
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారు వచ్చాక సచివాలయంలో సామాన్యుల సందడి పెరిగిపోయింది. కొత్త సచివాలయం ప్రారంభమైనప్పటి నుంచి గతేడాది డిసెంబరు 7 వరకు పెద్దగా జన సంచారం ఉండేది కాదు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయానికి సందర్శకులు పెద్దగా వచ్చేవారు కాదు. లోపలికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. తీరా ఎలాగోలా లోపలికి వెళితే.. సీఎం నుంచి మంత్రుల వరకు ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. దాంతో సమస్యలు ఉన్నప్పటికీ జనం సెక్రటేరియట్ ముఖం చూడటమే మానేశారు. ఒకానొక దశలో ప్రస్తుత మంత్రి, అప్పటి ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను కూడా లోపలికి అనుమతించలేదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి సచివాలయంలోకి నిత్యం వందల సంఖ్యలో అర్జీదారులు వస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో అందుబాటులో లేకపోయినా.. మంత్రులు ఉంటారని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. రోజుకు సుమారు 1,500-2,000 మందికిపైగా వస్తున్నట్టు సమాచారం. సెక్రటేరియట్లోకి వెళ్లేందుకు ఇస్తున్న పాస్లు దాదాపు 800-1,000 వరకు ఉంటుండగా, నేరుగా వెళ్లేవారు మరికొంత మంది. గత ప్రభుత్వంలో సెక్రటేరియట్లోకి వెళ్లేందుకు రోజుకు 400-600 వరకు మాత్రమే పాస్లను ఇచ్చినట్టు సమాచారం. వివిధ సమస్యలపై సచివాలయానికి వస్తున్న జనాన్ని మం త్రులు కలుస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో నాడు వెలవెలబోయిన సెక్రటేరియట్.. నేడు కళకళలాడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.