సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 19 , 2024 | 11:02 PM
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ ్జ(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్, జనవరి 19 : ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ ్జ(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు మిల్లర్లకు కేటాయించిన లక్ష్యం మేరకు సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియపై పౌర సరఫరాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, జాప్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న మిల్లర్ల నుండి వెంటనే మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇతర మిల్లులకు కేటాయింపు చేయాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, పౌరసరఫరాల అధికారి మనోహర్ రాథోడ్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ విజయలక్ష్మి, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు ప్రత్యేకంగా ఓట్ల నమోదు
నేడు, రేపు ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.శశాంక తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకితభావంతో కృషి చేయాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి ఏవైనా మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపులు చేపట్టాల్సి ఉన్నట్లయితే, ఫారం 7, 8 ద్వారా సరి చేసుకునేలా చూడాలన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరూ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులకు ఆయన సూచించారు.
ఓటరు నమోదుపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు నమోదుకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేస్తామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి బుధ, గురు వారాల్లో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, ఆర్డీవోలు సూరజ్కుమార్, సాయిరామ్, శ్రీనివాస్, మలయ్య, అనంతరెడ్డి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, డిప్యూటీ తహసల్దార్ బీఎస్ కుమారి, అధికారులు పాల్గొన్నారు.