సీఎం రేవంత్రెడ్డి హైటెన్షన్ వైర్
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:03 AM
కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి హైటెన్షన్ వైర్లాంటివారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా మాడి మసైపోతారని మంత్రి కోమటిరెడ్డి
![సీఎం రేవంత్రెడ్డి హైటెన్షన్ వైర్](https://media.andhrajyothy.com/media/2024/20240413/2_KOTAMREDDY_8fcdb7313e.jpg)
ముట్టుకుంటే మాడి మసైపోతారు
రాజగోపాల్ పవర్ ట్రాన్స్ఫార్మర్: మంత్రి వెంకట్రెడ్డి
యాదాద్రి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి హైటెన్షన్ వైర్లాంటివారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా మాడి మసైపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్రెడ్డి భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి హైటెన్షన్ వైర్లా ఉంటే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పవర్ ట్రాన్స్ఫార్మర్గా ఉన్నారని చెప్పారు. ‘‘గతంలో పూటకు గతిలేని ఓ పొట్టోడు పదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు అక్రమంగా దండుకొని నేడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అతడికి అన్ని రకాలుగా బుద్ధి చెప్పేందుకు సిద్దమవుతున్నారు’’ అని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికైనా వక్ర బుద్ధిని మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి శాస్తి తప్పదని సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లా సమస్యలకు నెలవుగా మారిందన్నారు. కేంద్రంలో పదేళ్లు అఽధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు చేసిందేమీ లేదని, కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. నల్లగొండ ఎంపీ స్థానాన్ని 5 లక్షలు, భువనగిరి స్థానాన్ని 4 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.