Share News

షికాగోలో నగర యువకుడిపై దాడి, దోపిడీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:53 AM

అమెరికాలోని షికాగో నగరంలో చదువుతున్న నగర యువకుడు సయ్యద్‌ మజర్‌ అలీపై అక్కడ దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. అతను నివసించే అపార్టుమెంట్‌ సమీపంలోనే వెంబడించిన ముగ్గురు దోపిడీ దొంగలు...

షికాగోలో నగర యువకుడిపై దాడి, దోపిడీ

తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని షికాగో నగరంలో చదువుతున్న నగర యువకుడు సయ్యద్‌ మజర్‌ అలీపై అక్కడ దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. అతను నివసించే అపార్టుమెంట్‌ సమీపంలోనే వెంబడించిన ముగ్గురు దోపిడీ దొంగలు... అతని ముఖంపై పిడిగుద్దులతో దాడి చేసి డబ్బు, ఇతర వస్తువులు దోచుకుని పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని లంగర్‌హౌజ్‌ హాషిమ్‌ నగర్‌లో నివసిస్తున్న అతని తల్లి, భార్య ఈమేరకు వివరాలు వెల్లడించారు. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్‌ మజర్‌ అలీ యూఎ్‌సలోని ఇండియానా వెస్లియాన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చదువుతున్నాడు. ఈ నెల 4న మజర్‌ అలీ భార్య రుఖయ్యా ఫాతిమాకు యూఎ్‌సలోని ఆమె భర్త స్నేహితుడు ఫోన్‌ చేసి దాడి గురించి వివరించాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని... కోలుకుంటున్నాడని వివరించాడు. వెంటనే వీడియో కాల్‌ ద్వారా భర్తను పరామర్శించిన ఆమె మాట్లాడటానికి ప్రయత్నించినా అతను మాట్లాడలేకపోయాడు. అతనికి వైద్య సాయం అందించాలని.. అతడి కాంటాక్ట్‌ నెంబరు, ఇతర వివరాలతో ఫాతిమా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మంగళవారం మెయిల్‌ పంపారు.

Updated Date - Feb 07 , 2024 | 04:53 AM