Share News

సీఎంఆర్‌ పూర్తి చేయకపోతే కేసులు

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:14 PM

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ పూర్తి చేయకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి హెచ్చరించారు.

సీఎంఆర్‌ పూర్తి చేయకపోతే కేసులు
యాలాల్‌లోని బాలాజీ రైస్‌మిల్‌ను తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

నెలాఖరులోగా ఎస్‌సీఐకి చేర్చాలి

వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల అదనపుకలెక్టర్లు లింగ్యానాయక్‌ , విజయేందర్‌రెడ్డి

మేడ్చల్‌ జనవరి 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలోని రైస్‌ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్‌ పూర్తి చేయకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లాలోని రైస్‌ మిల్లులను పౌరసరఫరాలతో అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలలోనినిల్వ, సీఎంఆర్‌ పెట్టిన వివరాలు, బకాయి ఎంత ఉందో రికార్డులు పరిశీలించారు. రైస్‌ నాణ్యత పరిశీలించారు. ఈ నెలాఖరులోగా బకాయిలు ఉన్న సీఎంఆర్‌ పూర్తి చేయాలని, రైస్‌ మిల్లర్ల యజమానులు రోజువారి లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దృష్టిసారించాలని మిల్లర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజరు రాజేందర్‌ పాల్గొన్నారు.

31లోగా సీఎంఆర్‌ను ఎస్‌సీఐకికి చేర్చాలి

వికారాబాద్‌/యాలాల, జనవరి 10 : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ఈనెల 31వ తేదీలోగా రైస్‌ మిల్లర్లు ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సిందేనని జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ స్పష్టం చేశారు. బుధవారం యాలాల్‌ మండలంలోని బాలాజీ, వెంకట పద్మావతి రైస్‌ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్‌ ఆదేశాల మేరకు రోజు వారీ లక్ష్యానికి అనుగుణంగా రైస్‌ మిల్లుల యజమానులు సీఎంఆర్‌ సరఫరా చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐకి చేరవేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం నిల్వలు, గన్నీ బస్తాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్‌ గుప్తా ఉన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:14 PM