నల్లగొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి
ABN , Publish Date - Feb 07 , 2024 | 03:50 AM
ఈనెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభకు ముందే ఆ పార్టీ నేతలు కాంగ్రె్సలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
![నల్లగొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి](https://media.andhrajyothy.com/media/2023/20231205/ll_74b9d41561.jpg)
లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలు
కేసీఆర్ తెలివితక్కువతనం వల్లే కాళేశ్వరం కూలింది
12-13 ఎంపీ స్థానాలు సాధిస్తాం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఈనెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభకు ముందే ఆ పార్టీ నేతలు కాంగ్రె్సలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీ భవన్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరిగిన పీఈసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 17 స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చాయన్నారు. కులాలు, సామాజిక వర్గాలవారీగా రేపటిలోగా పరిశీలించి సీఈసీకి పంపిస్తామని, తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని చెప్పారు. దరఖాస్తు చేయనివారి పేర్లనూ పరిశీలిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో 12-13 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందన్నారు. కేసీఆర్ తెలివితక్కువతనం వల్లనే కాళేశ్వరం కుప్పకూలిందని విమర్శించారు.