Share News

ఐటీఐఆర్‌ రద్దుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:37 AM

యాభై వేల ఎకరాల్లో 68 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)’

ఐటీఐఆర్‌ రద్దుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం

డీపీఆర్‌ ఇవ్వాలని కోరినా స్పందించలేదు

ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం సమాధానం

హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): యాభై వేల ఎకరాల్లో 68 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన భారీ ప్రాజెక్టు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)’. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఐటీ రంగం రూపురేఖలే మారిపోయేవి. 2012లో కేంద్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును.. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్రంలోని గత కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుపడుతూ వచ్చింది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్‌ అనేకమార్లు చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా బదులిచ్చింది. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దుకు రాష్ట్రంలోని గత ప్రభుత్వమే కారణమని స్పష్టం చేసింది. దీనిపై ఆర్టీఐ కార్యకర్త రవికుమార్‌ చేసిన దరఖాస్తుకు స్పందిస్తూ కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సమాధానం ఇచ్చింది. ఏప్రిల్‌ 7, 2016, జనవరి 11, 2017లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌పై సమావేశం నిర్వహించింది. రైల్వే, కేంద్ర రహదారుల శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖల ప్రతినిధులతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అయితే తర్వాత తాము కోరిన విధంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. పలుమార్లు గుర్తుచేసినా అప్పటి స్పందన లేకపోవడంతో దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఇతర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది.

Updated Date - Jan 09 , 2024 | 04:37 AM