Share News

నేడు బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:30 AM

కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నేడు (శుక్రవారం) చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు.

నేడు బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’

వాస్తవాలను ప్రజల ముందుంచుతాం: కేటీఆర్‌..

కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం: కడియం

హైదరాబాద్‌/భూపాలపల్లి/హనుమకొండ టౌన్‌/న్యూఢిల్లీ/సుబేదారి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నేడు (శుక్రవారం) చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై ప్రజలకు అసలు నిజాలు తెలియపరిచే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరితో కలిసి వెళ్లనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. 200 మందికి పైగా పార్టీ నేతలతో బస్సుల్లో బయలుదేరి వెళ్లి.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి.. అక్కడి నుంచే మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామన్నారు. మరోవైపు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి బస్సులో వస్తున్న కేటీఆర్‌ను వరంగల్‌ నేతలు జనగామ సమీపంలో నెల్లుట్ల వద్ద ఉదయం 10 గంటలకు స్వాగతం పలికి ర్యాలీగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, బాల్క సుమన్‌, తదితర బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇటు హనుమకొండలోని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఇందులో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్‌, నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడియం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చూపుతామని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసం వాడుకుంటున్న కాంగ్రెస్‌ బండారం బయటపెడతామని చెప్పారు.

బొందలగడ్డకు ఎందుకు: రామచంద్ర

బీఆర్‌ఎస్‌ చేపట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమంపై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు.. అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్‌ డిమాండ్‌ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేషనల్‌ డ్యామ్స్‌ అథారిటీ సూచనలు ఖాతరు చేయకుండా.. శాస్త్రీయత లేకుండా నిర్మించారు. మేడిగడ్డను బొందలగడ్డ అని పిలిచిన కేసీఆర్‌.. మరి బీఆర్‌ఎస్‌ నేతలను అక్కడికి ఎందుకు పంపుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. మందుల సామెల్‌ మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌, హరీశ్‌లు మేడిగడ్డకు బొక్క కొట్టారు. దీన్ని చూడటానికి వెళ్తున్నారా కేటీఆర్‌..? కమీషన్ల కోసం కాళేశ్వరమని అన్నందుకు నాయిని నర్సింహారెడ్డికి టికెట్‌ ఇవ్వలేదు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో 2, 3 సీట్లు గెలవాలని చూస్తున్నారు కానీ అది నెరవేరదు. బీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మే స్థితిలో లేరు’ అని చెప్పారు. కాకమ్మ కథలు చెప్పేందుకే బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేస్తుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాజకీయ లబ్ధి కోసం చేపట్టిందే తప్ప రైతుల లబ్ధి కోసం చేపట్టింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నిపుణులు చెప్పేదాని కోసం అందరూ ఎదురుచూస్తుంటే ఆ డ్యామ్‌కు పగులుపెట్టిందే కాంగ్రెస్‌ అని బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారానికి తెరలేపిందని మండిపడ్డారు. చేసిన పాపాలకు కేసీఆర్‌ లెంపలేసుకోవాలన్నారు.

ప్రజలకు బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి: కూనంనేని

మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ హయాంలోనే నిర్మించిన మేడిగడ్డ కుంగింది. అన్నారం బ్యారేజీలో పగుళ్లు ఏర్పడ్డాయి. మేడిగడ్డను బొందలగడ్డ అని.. అక్కడికే పంపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులు ఏది చెబితే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిపుణులు త్వరగా తేల్చితే పరిష్కారం దొరుకుతుంది’ అని అన్నారు.

పాలమూరు వెనకబాటుకు కాంగ్రెస్సే కారణం..

పాలమూరు జిల్లా వెనుకబాటుకు, అక్కడి నుంచి 14 లక్షల మంది వలస వెళ్లడానికి కాంగ్రెస్‌ విధానాలే కారణమని బీఆర్‌ఎస్‌ నేతలు వి.శ్రీనివా్‌సగౌడ్‌, సి.లక్ష్మారెడ్డి, మన్నె శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తుకున్నాకే.. అక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి శిలాఫలకాలు పడ్డాయన్నారు. అయితే ఆయా ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెడితే.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిచేశామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ అవరోధాలు సృష్టించినా కేసీఆర్‌ 90 శాతం పనులు చేపట్టామన్నారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేయాల్సిందిపోయి.. కాంగ్రెస్‌ నేతలు పాలమూరు యాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 04:30 AM