కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:53 AM
మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. రాష్ట్రంలో 15ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. బీఆర్ఎ్సకు ఒక్క సీటు కూడా వస్తుందో, రాదో
నేను పిలిస్తే 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. రాష్ట్రంలో 15ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. బీఆర్ఎ్సకు ఒక్క సీటు కూడా వస్తుందో, రాదో తెలియదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసింది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహన్రెడ్డికి అప్పగించి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఎండబెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నల్లగొండ జిల్లాలో బస్సు యాత్ర చేపడుతున్నారని నిలదీశారు. ప్రస్తుత కరువుకు పదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. పదేళ్ల పాలనలో రైతులకు నీరందించే ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను పిలిస్తే 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్సలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో తామంతా ఒక జట్టుగా ఉన్నామని, రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని, అధికారంలోకి రాకమునుపు ఆయన స్థాయి ఏంటో, ఇప్పుడు రూ.5వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారో అందరికీ తెలుసన్నారు. ప్రధాని మోదీ తన స్థాయికి తగ్గించుకుని మాట్లాడారని, మత ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.