Share News

కారెక్కిన ఏనుగు!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:40 AM

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై తీవ్రస్థాయిలో

కారెక్కిన ఏనుగు!

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు

కేసీఆర్‌ ఇంటికి వెళ్లి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చర్చలు

పొత్తును స్వయంగా ప్రకటించిన ఇరువురు నేతలు

మాయావతితో మాట్లాడాక విధివిధానాలపై ప్రకటన

దీర్ఘకాలిక వ్యూహంతోనే బీఎస్పీతో దోస్తీ: కేసీఆర్‌

కాంగ్రెస్‌ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోంది

లౌకికవాదాన్ని కాపాడిన నేత కేసీఆర్‌: ప్రవీణ్‌కుమార్‌

ప్రవీణ్‌.. ఇప్పుడు కేసీఆర్‌ హీరో అయ్యారా?: మురళి

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే ఈ పొత్తు అంశం హఠాత్తుగా బయటపడినప్పటికీ.. గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంటు స్థానాల్లో రెండు పార్టీల మధ్య సర్దుబాటు, బీఎస్పీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన స్థానాలపై మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో మంగళవారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీ ప్రతినిధుల బృందం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి పొత్తు విషయాన్ని ప్రకటించారు. కాగా, పొత్తులో భాగంగా ప్రవీణ్‌కుమార్‌కు నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొనాలని, క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ శ్రేణుల మద్దతు తీసుకొని ముందుకు సాగాలనీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతోపాటు ఈ పొత్తు లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవీణ్‌కుమార్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, పొత్తుకు సంబంధించి విధి విధానాలు, ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది త్వరలోనే వెల్లడిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ప్రజల జీవితాలను బాగు చేసేందుకే

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ స్నేహం ప్రజల జీవితాలను బాగు చేస్తుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కేసీఆర్‌ను కలవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉందని, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్‌ కూడా బీజేపీలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని నిరంతరం కాపాడిన నేత కేసీఆర్‌ మాత్రమేనని, అందుకే ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ పార్టీ అధినేత్రి మాయావతితో కేసీఆర్‌ మాట్లాడాక సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన బీఆర్‌ఎ్‌సతోనే పొత్తు పెట్టుకోవడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలు అలాగే ఉంటాయన్నారు. బహుజనుల మీద ఎవరు దాడులు చేసినా.. అక్కడ తాను ఉంటానన్నారు. తాను వ్యక్తుల మీద పోరాటం చేయలేదని, ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు మాత్రమే పోరాటం చేశానని అన్నారు.

ఎలా స్పందించాలో తెలియడంలేదు: ఆకునూరి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందించాలో తెలియడం లేదని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గత రెండేళ్లుగా బీఆర్‌ఎస్‌ గురించి చెప్పినవన్నీ తప్పులన్నట్లేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్‌.. ఇప్పుడు హీరో అయ్యారా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ‘‘గాడిద మీద ఎక్కినా.. మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? రేపు బీఆర్‌ఎస్‌ కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయం పోలీస్‌ బాస్‌.. మీ స్టెప్‌ కరెక్ట్‌ కాదు. మిమ్మల్ని, మీ రాజకీయాలను చూశాక యువత ఇక ఎవరినీ నమ్మరు. సారీ మిస్టర్‌ ఆర్‌ఎస్పీ.. బీఎస్పీ’’ అని మురళి ట్వీట్‌ చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిన్నటిదాకా విమర్శలు చేసిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:40 AM