Manchiryāla- బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి
ABN , Publish Date - Mar 12 , 2024 | 10:45 PM
మండలంలోని జోడు వాగుల సమీపంలో అధ్వాన్నంగా ఉన్న బ్రిడ్జి, రోడ్డు నిర్మాణాలను వెంటనే చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు మంగళవారం జోడువాగు బ్రిడ్జి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
![Manchiryāla- బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి](https://media.andhrajyothy.com/media/2024/20240306/31_BHEEMARAM_12_53ca434471.gif)
భీమారం, మార్చి 12: మండలంలోని జోడు వాగుల సమీపంలో అధ్వాన్నంగా ఉన్న బ్రిడ్జి, రోడ్డు నిర్మాణాలను వెంటనే చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు మంగళవారం జోడువాగు బ్రిడ్జి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. దీంతో పాటు రోడ్డుకిరువైపులా విపరీతమైన దుమ్ములేవడం వల్ల వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కొంత మంది గాయపడితే మరికొందరు మృతిచెందుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా మధుకాన్ కంపెనీ సంస్థ బ్రిడ్జి నిర్మించడంలో విఫమలైందని విమర్శించారు. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినా జోడువాగుల సమీపంలోని బ్రిడ్జి, రోడ్డు దుస్థితి మారడం లేదన్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే జాతీయ రహదారి ఇంత అధ్వానంగా ఉన్నా పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిజాం కాలం నాటిదని, ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ రహదారిపై సెంట్రల్ లైట్లు వెలగడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు చందు, రాజేశ్వరి, చంద్రన్న, సమ్మక్క, దుంపల రంజిత్, కుల, ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.