బీబీనగర్ ఎయిమ్స్లో రక్తశుద్ధి సేవలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:11 AM
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో హీమోడయాలసిస్ (రక్త శుద్ధి) సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డైరెక్టర్ వికాస్భాటియా తెలిపారు.
బీబీనగర్, ఏప్రిల్ 18: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో హీమోడయాలసిస్ (రక్త శుద్ధి) సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డైరెక్టర్ వికాస్భాటియా తెలిపారు. గురువారం ఈ మేరకు నెఫ్రాలజీ విభాగంలో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు కోసం డైరెక్టర్ భాటియా సంబంధిత విభాగాల అధిపతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీమోడయాలసిస్ సేవల ఆవశ్యకతను గుర్తించినట్లు తెలిపారు. ఇంత కాలం ఈ సేవలు అందుబాటులో లేని కారణంగా ఎయిమ్స్కు వచ్చిన రోగులను ఇతర ప్రాంతాలకు పంపించామని, అయితే ప్రస్తుత సేవలు అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకోసం అదనంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. యూనిట్లలో ఐదు హీమోడయాలసిస్ మిషన్లు, ఒక ఆర్వో సిస్టం, ఐదు ఐసీయూ బెడ్లు, మూడు మానిటర్లు, ఈసీజీ అందుబాటులో ఉంటాయన్నారు. అదనంగా వాస్కులర్, యాక్సెస్ ప్రక్రియ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కల్యాణి సూర్య ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.