నేడు లేదా రేపు బీజేపీ తొలి జాబితా?
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:20 AM
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా వందకుపైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్ర లేదా శనివారం ప్రకటించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వందకుపైగా అభ్యర్థుల ప్రకటన
రాష్ట్రంలో ఆరేడు స్థానాల్లో పోటీదారుల పేర్ల వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా వందకుపైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్ర లేదా శనివారం ప్రకటించే అవకాశం ఉంది. అందులో తెలంగాణ నుంచి ఆరేడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం అర్ధ రాత్రి వరకు జరిగింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్.. డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సిటింగ్ ఎంపీ స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్ మినహా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, సికిందరాబాద్ నుంచి కిషన్రెడ్డి పేర్లుంటాయని తెలిసింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గురువారమే బీజేపీలో చేరిన ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడిని నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించే అవకాశముంది. మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్నగర్ స్థానాలపైనా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది.