ఎమ్మెల్యే కసిరెడ్డి కారును ఢీకొన్న బైక్
ABN , Publish Date - May 07 , 2024 | 06:14 AM
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే కసిరెడ్డి
ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే
తలకొండపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే కసిరెడ్డి వెల్జాలలో నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఎమ్మెల్యే తన కారులో వెల్జాల నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తలకొండపల్లి-మిడ్జిల్ రహదారిపై రామాసిపల్లి మైసమ్మ ఆలయ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బైక్.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు (టీఎస్11 ఈవై 1899)ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న అదే గ్రామానికి చెందిన బైరపాక పరశురాములు(36) తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బైక్ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ కారును రోడ్డు పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే సీటుబెల్ట్ పెట్టుకోవడం, డ్రైవర్ అప్రమత్తతతో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే కసిరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు డ్రైవర్, గన్మ్యాన్కు ఏమీ కాలేదు. ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డిని కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరశురాములును వెల్దండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మెల్యేను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతతో ఎమ్మెల్యే కసిరెడ్డి భయాందోళనకు గురయ్యారు. కాగా ఎమ్మెల్యే కసిరెడ్డిని సీఎం రేవంత్ ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే కారు ప్రమాదం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కల్వకుర్తి ఆస్పతిక్రి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.