Share News

లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:15 PM

రైతులు అధిక దిగుబడులు సాధించి లాభసాటి వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి సూచించారు.

 లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి

- రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

- వనపర్తి జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి

వనపర్తి రూరల్‌, జూన్‌ 6: రైతులు అధిక దిగుబడులు సాధించి లాభసాటి వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి సూచించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన 3,4వ స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ చైర్మన్‌ అధ్యక్షత వహించారు. మూడవ స్థాయీ సంఘం సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై చర్చించారు. నాలుగవ స్థాయీ సంఘం సమావేశంలో విద్య, వైద్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో చాలా సారవంతమైన భూములు, వ్యవసాయానికి అనువైన వాతావరణం ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకుని రైతులు అధికదిగుబడితో పాటు లాభసాటి వ్యవసాయం చేసేవిధంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. యువత ఆధునిక సాంకేతికతో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా ఇప్పటి నుంచే చొరవ తీసుకోవాలని సూచించారు. అయిల్‌ పామ్‌, పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి పంటల వైపు రైతులను మళ్లించాలని అందుకు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించి అన్ని పంటలకు బీమా చే యించాలని తెలిపారు. వనపర్తిలో కూరగాయలు నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వచ్చే హరితహారం కోసం సన్నద్ధం కావాలని సూచించారు. అధికారులు తమ వద్ద ఉన్న వనరులతో రైతుల కు మేలు చేయాలని సమస్యలను ప్రజాప్రతినిధుల, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జడ్పీ సీఈవో యాదయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌ గౌడ్‌, పెద్దమందడి జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఆత్మకూరు జడ్పీటీసీ శివరంజని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌, ఉద్యానవన జిల్లా అధికారి సురేష్‌, మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప,పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్‌ రెడ్డి, భూగర్భ జలాలు అధికారి మోహన్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అమోల్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:15 PM