వికారాబాద్ జిల్లాకు ఆగ్రనేతల రాక...
ABN , Publish Date - May 08 , 2024 | 11:22 PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 11వ తేదీ, శనివారం ఉదయం 10.30 గంటలకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 10.50 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు.
![వికారాబాద్ జిల్లాకు ఆగ్రనేతల రాక...](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు
11న ఉదయం 11 గంటలకు వికారాబాద్లో బహిరంగ సభ
వికారాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 11వ తేదీ, శనివారం ఉదయం 10.30 గంటలకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 10.50 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్ఏపీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. 11 నుంచి 11.45 గంటల వరకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 11.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా వికారాబాద్ నుంచి బయలుదేరి వనపర్తిలో జరిగే ఎన్నికల ప్రచార సభకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే, ఎస్ఏపీ కళాశాల ఆవరణలో అమిత్షా బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. కళాశాల సమీపంలోనే హెలీప్యాడ్ నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను బుధవారం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర పార్టీ నాయకులు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. వికారాబాద్లో జరిగే అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షకులుగా చేవె ళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్లమెంట్ ప్రభారీ ఎ.విష్ణువర్ధన్రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ఎన్.మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు.
ప్రియాంకా గాంధీ తాండూరుకు రాక
11న మధ్యాహ్నం 1.15 గంటకు జరిగే బహిరంగ సభకు హాజరు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు హెలీక్యాప్టర్లో తాండూరుకు చేరుకుంటారు. విలియమ్ మూన్ హైస్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2.10 గంటల వరకు ఆమె తాండూరు నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వెళ్లనున్నారు. ప్రియాంకా గాంధీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఎవరెవరు పాల్గొంటారనేది గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.