అర్ధ శతాబ్ది ప్రవాసం.. చరమాంకంలో చెరసాలలో మరణం
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:43 AM
దాదాపు అర్ధ శతాబ్దం పాటు గల్ప్లో గడిపి, అవసాన దశలో మాతృభూమికి చేరుకోవాలనుకుని, సంస్థ నుంచి తనకు రావలసిన బకాయిలను పొందే క్రమంలో వేచి చూసి అనుకోకుండా జైలు పాలైన ఓ అభాగ్యుడు చివరికి చెరసాలలోనే
![అర్ధ శతాబ్ది ప్రవాసం.. చరమాంకంలో చెరసాలలో మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎడారి దేశంలో మరణించిన ప్రవాసి మృతదేహం రాక
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దాదాపు అర్ధ శతాబ్దం పాటు గల్ప్లో గడిపి, అవసాన దశలో మాతృభూమికి చేరుకోవాలనుకుని, సంస్థ నుంచి తనకు రావలసిన బకాయిలను పొందే క్రమంలో వేచి చూసి అనుకోకుండా జైలు పాలైన ఓ అభాగ్యుడు చివరికి చెరసాలలోనే మృత్యుచెందిన దయనీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్లో అతను చనిపోగా, మృతదేహం ఇటీవల స్వదేశానికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన చిలుమల్ల కొమరయ్య 1976లో పొట్టచేత్తో పట్టుకుని సౌది అరేబియా వెళ్లాడు. ఆనాటి నుంచి మరణించే ముందు వరకు సుదీర్ఘ కాలం ఓ కంపెనీలో పనిచేశాడు. అయితే కొన్ని ఉల్లంఘనలకు పాల్పడటంతో సదరు కంపెనీ నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దాంతో కొమరయ్య వీసా రెన్యువల్ కాలేదు. పెండింగ్లో ఉన్న జీతం ఇస్తే స్వదేశానికి వెళ్లిపోతానని కోరినా.. యజమాని నిరాకరించాడు. చివరికి వీసాను రద్దు చేసైనా పైకాన్ని ఇవ్వాలని కొమరయ్య ప్రాధేయపడ్డాడు. అయిన యజమాని కనికరించలేదు. చేసేదేమిలేక స్వదేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. చివరికి జైలులో అనారోగ్యానికి గురై గతేడాది నవంబరులో మరణించాడు. మృతదేహం ఇటీవల హైదరాబాద్కు చేరుకుంది. అతని కుటుంబం దయనీయ స్థితిలో ఉండటంతో.. జెద్దాలోని భారతీయ కాన్సులేటు ముందుకు వచ్చి స్వంత ఖర్చులతో కొమరయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించింది.