Share News

పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 12 , 2024 | 11:02 PM

జడర్ల నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌ వెల్లడించారు.

పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌

- పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌

మిడ్జిల్‌, మే 12 : జడర్ల నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌ వెల్లడించారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధరణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచో భూటియా, ఎస్పీ హర్షవర్ధన్‌, ఏఆర్‌ వో మోహన్‌రావులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని మొత్తం 2 లక్షల 22వేల 838 మంది ఓటర్లున్నాట్లు తెలిపారు. పురుషులు లక్ష 11వేల 53 మంది, మహిళా ఓటర్లు లక్ష11వేల 779, ఇతరులు 6మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 274, ఎన్నికలకు సిబ్బంది 1300, రూట్స్‌ 30, సెక్టోరియల్‌ అధికారులు 70 మందిని నియమించినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు అన్ని వసతులను కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద వీలుఛైరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో పాటు సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఈవీఎం, పోలింగ్‌ సామాగ్రితో సిబ్బంది, సాయుధ బలగాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులున్నారు.

Updated Date - May 12 , 2024 | 11:02 PM