Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

TS Politics: బీఆర్‌ఎస్‌లో పోటీకి సిటింగ్‌లు విముఖం?.. బీఆర్ఎస్‌లో అనూహ్య పరిస్థితులు

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:19 AM

లోక్‌సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వింత సమస్యను ఎదుర్కొంటోంది..!

TS Politics: బీఆర్‌ఎస్‌లో పోటీకి సిటింగ్‌లు విముఖం?.. బీఆర్ఎస్‌లో అనూహ్య పరిస్థితులు

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ!

ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు.. నేడోరేపో మరో ముగ్గురు..

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వింత సమస్యను ఎదుర్కొంటోంది..! అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిటింగ్‌ ఎంపీలు ఆ పార్టీ తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సిటింగ్‌ ఎంపీలను బుజ్జగిస్తున్నా.. కొందరు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీంతో.. ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా చేవెళ్ల సిటింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పోటీకి నో అంటున్నట్లు సమాచారం. దాంతో ఆ స్థానం నుంచి కాసాని వీరేశం.. లేదా సబితారెడ్డి తనయుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రంజిత్‌రెడ్డి బాటలోనే దక్షిణ తెలంగాణలో ఓ సిటింగ్‌ ఎంపీ కూడా పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని సమాచారం. మహబూబాబాద్‌ సిటింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత కూడా ఈసారి పోటీకి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్‌ఎ్‌సను వీడిన విషయం తెలిసిందే..! ఒకట్రెండ్రోజుల్లో మరో ముగ్గురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే..! ఇప్పుడు మాత్రం టికెట్‌ వచ్చినా.. పోటీ చేసే పరిస్థితి లేదని ఓ సీనియర్‌ నేత వాపోయారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియ్‌సగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పోలింగ్‌ సమరోత్సాహానికి సన్నద్ధమవుతోంది. మోదీ-3.0 నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. తెలంగాణలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను సాధించాలని అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ కూడా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ మాత్రం చావో రేవో అని తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్‌ సర్కారుపై వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్‌ చెబుతున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీలు కొందరు ఈ సారి ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేస్తుండడం ఆ పార్టీకి ప్రతికూలాంశమే..!

కరీంనగర్‌లో బోయినపల్లి, పెద్దపల్లిలో కొప్పుల

బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ సోమవారం పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. కరీంనగర్‌, పెద్దపల్లి అభ్యర్థులను ఆదివారమే ఖరారు చేశారని తెలుస్తోంది. వీటితోపాటు ఖమ్మం, మహబూబాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, జహీరాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి, సోమవారం సాయంత్రానికి ప్రకటిస్తారని సమాచారం. బీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం ప్రకారం కరీంనగర్‌ స్థానానికి బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌ పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Updated Date - Mar 04 , 2024 | 08:00 AM