ఉప్పొంగిన సిరిపురం వాగు
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:59 PM
వికారాబాద్ జిల్లాలో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మర్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి.
మర్పలి/వికారాబాద్, ఆగస్టు 17:వికారాబాద్ జిల్లాలో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మర్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. సిరిపురం వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మర్పల్లి నుంచి మోమిన్పేట్కు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నించొద్దని ఎస్సై సురేశ్ సూచించారు. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఈవో కార్యాలయం ముందు వరద నీరు చేరడంతో చెరువును తలపించింది. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు చిత్తడిగా మారాయి.