Share News

మద్యం ప్రియులకు అడ్డాగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:33 PM

నిలువ నీడలేని అభాగ్యుల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

మద్యం ప్రియులకు అడ్డాగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

నందిగామ, ఫిబ్రవరి 13: నిలువ నీడలేని అభాగ్యుల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. నందిగామ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం 120 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించింది. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు వాటిని కేటాయించినప్పటికీ ప్రారంభ సమయంలో ఎన్నికలు రావడంతో కేటాయింపు వాయిదా పడింది. దీంతో వాటి పంపిణీని అధికారులు కూడా గాలికి వదిలేశారు. ఇదే అదునుగా భావించిన మద్యం ప్రియులు, పోకీరీలు వాటిలో మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు సీసీ కెమెరాలు బిగించకపోవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. పక్కనే పోలీస్‌స్టేషన్‌ ఉన్నా కూడా ఈ కార్యకలాపాలకు కేంద్రంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మారడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు వారి ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:33 PM