గృహలక్ష్మి పథకం రద్దు
ABN , Publish Date - Jan 03 , 2024 | 03:23 AM
రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రద్దు చేసింది.
గత ప్రభుత్వం మంజూరు
చేసిన పత్రాలు కూడా..
దాని స్థానంలో అభయహస్తం
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో ‘అభయహస్తం’ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. సొంత జాగా కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం చేసేలా గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. దీని కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,12,095 మందికి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. అయితే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అభయహస్తం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది.