JEE Main : జేఈఈ మెయిన్లో తెలుగు విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:36 AM
జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మళ్లీ సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో జాతీయ స్థాయిలో మెరిశారు. ఈ నెల 4-12 తేదీల్లో నిర్వహించిన సెషన్-2 (పేపర్-1 బీఈ, బీటెక్)
100 పర్సంటైల్ సాధించిన 56 మందిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే
15 మందిది తెలంగాణ, ఏడుగురిది ఏపీ
5 విభాగాల్లో 24 మంది టాపర్లూ మనోళ్లే
జనరల్ క్యాటగిరీలో 40 మందికి 12 మంది
ఈడబ్ల్యూఎస్లో టాపర్లు అందరూ కూడా..
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందికి జేఈఈ
అడ్వాన్స్డ్కు అర్హత.. మే 26న తుది పరీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మళ్లీ సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో జాతీయ స్థాయిలో మెరిశారు. ఈ నెల 4-12 తేదీల్లో నిర్వహించిన సెషన్-2 (పేపర్-1 బీఈ, బీటెక్) పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.67 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో 56 మంది 100 పర్సంటైల్ సాధించగా, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. వీరిలో తెలంగాణ నుంచి 15 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు ఉన్నారు. ఇద్దరు విద్యార్థినులు (సాన్వి జైన్- కర్ణాటక), శైనా సిన్హా- ఢిల్లీ) మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. సెషన్-2లో మొత్తం 3,29,600 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరయ్యారు.
ఈడబ్ల్యూఎస్లో టాపర్లంతా మనోళ్లే
100 పర్సంటైల్తో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లోనూ ఆలిండియా టాపర్లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ విభాగంలో 1,34,465 లక్షల మంది పరీక్ష రాయగా ఆరుగురు మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. వీరంతా తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు. జనరల్ విభాగంలో మొత్తం 3,77,921 మంది పరీక్ష రాయగా 40 మంది 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 9, ఏపీ నుంచి ముగ్గురు.. మొత్తం 12 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ (ఎన్సీబీ) విభాగంలో మొత్తం 10 మంది 100 పర్సంటైల్ సాధించగా వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో (పీడబ్ల్యూడీ) 3,369 మంది పరీక్షకు హాజరవ్వగా తెలంగాణ విద్యార్థి చుంచికల శ్రీచరణ్ టాపర్గా నిలిచాడు. ఎస్టీ విభాగంలో తెలంగాణ విద్యార్థి జగన్నాథం మోహిత్ ప్రథమ స్థానం సాధించాడు.
మే 26న జేఈఈ అడ్వాన్స్డ్
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 26న జరగనుంది. దీన్ని ఈసారి ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు సాధించిన దాదాపు రెండున్నర లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ నెల 27 నుంచి మే 7వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 9న ఫలితాలు ప్రకటిస్తారు.
