633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:25 AM
వైద్య ఆరోగ్యశాఖ నుంచి 15 రోజుల వ్యవధిలో మూడో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం బోర్డు కార్యదర్శి
5వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు.. తుది గడువు 21.. నవంబరు 30న రాత పరీక్ష
తుది గడువు 21.. నవంబరు 30న రాత పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలు
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్
నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ బోర్డు
15 రోజుల్లో 3 నోటిఫికేషన్లు.. 3967 పోస్టుల భర్తీ
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ నుంచి 15 రోజుల వ్యవధిలో మూడో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం బోర్డు కార్యదర్శి గోపికాంత్రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న 1284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులతో ఒకటి, గతవారం 2050 స్టాఫ్నర్సుల పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 3,967 పోస్టుల భర్తీకానున్నాయి. అర్హులైన అభ్యర్ధులు అక్టోబరు 5 నుంచి 21వ తేదీ (సాయంత్రం ఐదింటి దాకా) వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి కోరారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబరు 23-24 తేదీల మధ్య ఎడిట్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. నవంబరు 30న రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లో, ఇంగ్లిషులోనే ఉంటుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్ కల్పించారు. ఇందుకు సర్కారీ దవాఖానాల్లో పనిజేస్తున్నట్లు ఎక్స్పీరియెన్స్ సర్టిఫికేట్ను జత చేయాల్సివుంటుంది. అలాగే అభ్యర్ధులు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు రిజిష్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్దులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు ఇచ్చారు. ఎన్సీసీ, ఎక్స్ సర్వీ్సమ్యాన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(ఆర్టీసీ, మునిసిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల వయోపరిమితిని సడలింపునిచ్చారు. పోస్టుల్లో 95 శాతం స్థానికులకేనని స్పష్టం చేసింది.
80 మార్కులకు రాత పరీక్ష, పాయింట్ల ఆధారంగా
పోస్టులను వంద పాయింట్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజ్ కింద కలుపుతారు. అభ్యర్ధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిజేస్తే వెయిటెజ్ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం 6 మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లోనైతే ప్రతి 6నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను అప్లోడ్చేయాలని బోర్డు పేర్కొంది. వివరాలకు ఠీఠీఠీ.ఝజిటటఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
ఆ పోస్టులివే..
మొత్తం 633 పోస్టులుండగా అందులో 446 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో, మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు ఆస్పత్రుల్లో, మరో రెండు పోస్టులు హైదరాబాద్ ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో ఉన్నాయి. జోన్ వన్లో 79, జోన్ రెండులో 53, మూడులో 86, నాలుగులో 98, ఐదులో 73, ఆరులో 154, ఏడో జోన్లో 88 పోస్టులున్నాయని మెడికల్ బోర్డు తెలిపింది. కాగా హైదరాబాద్ జోన్ అయిన ఆరులో అత్యధికంగా 154 పోస్టులుండగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జోన్ అయిన రెండులో కేవలం 53 పోస్టులే ఉన్నాయి.
పరీక్షా కేంద్రాలు
ఎల్టీ పోస్టులకు రాష్ట్రంలో 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయని మెడికల్ బోర్డ్ పేర్కొంది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణాలను పరీక్షా కేంద్రాల కింద ఎంపిక చేశారు.
విద్యార్హతలు..
డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ చేసిన అభ్యర్థులే అర్హులని మెడికల్ బోర్డు వెల్లడించింది. అభ్యర్ధులంతా దరఖాస్తు చేసే సమాయానికి తప్పనిసరిగా తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ చేసుకొని ఉండాలని పేర్కొంది.
స్థానికులకు 95 రిజర్వేషన్ ఫార్మాసిస్టు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లలోని అభ్యర్థులకే 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు... జోన్2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్5వీలో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్7లో పాలమూరు, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.