నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
ABN , Publish Date - Mar 18 , 2024 | 04:20 AM
పదో తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉదయం 9.30కు ప్రారంభం.. 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్టైం
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి అనుమతించమనే నిబంధనను ఈ పరీక్షల్లో అమలు చేయడం లేదు. పైగా, విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ కల్పించారు. అంటే, షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. గ్రేస్ టైమ్ నిబంధన ప్రకారం గం.9:35 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీళ్లలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 2,676 కేంద్రాలను సిద్ధం చేశారు. సైన్స్ మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30- 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్ష పేపర్ -1 (ఫిజికల్ సైన్స్), పేపర్-2 (బయోలాజికల్ సైన్స్)గా రెండు రోజుల పాటు ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9.30-11 గంటల వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు 30వేల మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. కాగా, పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏదైనా సాయం అవసరమైతే రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం నంబర్కు 040-23230942 కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.