Share News

వినేశ్‌.. చలో పారిస్‌ రీతిక, అన్షు కూడా..

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:53 AM

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు పారిస్‌ బెర్త్‌లు పట్టేశారు. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ (50కి), రీతిక (76కి.), అన్షూ మాలిక్‌ (57కి.) తమతమ విభాగాల్లో...

వినేశ్‌.. చలో పారిస్‌ రీతిక, అన్షు కూడా..

భారత్‌కు మూడు ఒలింపిక్‌ బెర్త్‌లు

ఆసియా రెజ్లింగ్‌ క్వాలిఫయర్స్‌

బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌): ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు పారిస్‌ బెర్త్‌లు పట్టేశారు. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ (50కి), రీతిక (76కి.), అన్షూ మాలిక్‌ (57కి.) తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరడం ద్వారా పారిస్‌ విశ్వక్రీడల ‘టిక్కెట్‌’ ఖాయం చేసుకున్నారు. కాగా..వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ద్వారా అంతిమ్‌ ఫంగల్‌ (53కి.) ఇంతకుముందే విశ్వక్రీడలకు క్వాలిఫై అయ్యింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై చేస్తున్న పోరాటం తన సత్తాకు అడ్డురాదని స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ నిరూపించింది. 50 కి. విభాగంలో తిరుగులేని ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులకు ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా టైటిల్‌ ఫైట్‌కు చేరింది. 29 ఏళ్ల వినేశ్‌ వరుసగా మూడో ఒలింపిక్స్‌ బరిలో దిగనుండడం విశేషం. రియో (2016), టోక్యో (2020) క్రీడల్లో ఆమె తలపడిన సంగతి తెలిసిందే. శనివారం..తొలి బౌట్‌లో కొరియా ప్రత్యర్థి మిరాన్‌ చియాన్‌ను ఒక నిమిషం 39 సెకన్లలోనే చిత్తు చేసిన వినేశ్‌..ఆపై క్వార్టర్‌ఫైనల్లో కంబోడియాకు చెందిన మనంగ్‌ దిత్‌ను కేవలం 67 సెకన్లలోనే మట్టి కరిపించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ్‌సలో 19 ఏళ్ల కజక్‌ రెజ్లర్‌ లారా గనికిజి తొలుత ఫొగట్‌ను ఒకింత ప్రతిఘటించింది. కానీ తన అనుభవాన్ని రంగరించిన భారత స్టార్‌ వినేశ్‌ ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్‌ ఫైట్‌కు చేరింది. ఇక..57 కేజీల క్వార్టర్స్‌లో కల్మిరా (కిర్గిస్థాన్‌)పై నెగ్గిన అన్షు..సెమీ్‌సలో లేలోఖోవ్‌ (ఉజ్బెక్‌)ని ఓడించింది. 76 కిలోల మొదటి రౌండ్‌లో వాంగ్‌ (కొరియా)పై సునాయాసంగా నెగ్గిన రీతిక..తదుపరి దవానసన్‌ (మంగోలియా)ను ఓడించింది. గ్రూప్‌ చివరి బౌట్‌లో జువాంగ్‌ (చైనా)పై, సెమీఫైనల్లో చాంగ్‌ (తైపీ)పై రీతిక విజయం సాధించింది. 62 కేజీలలో..మాన్సీ అహ్లావత్‌ సెమీఫైనల్లో పరాజయంతో త్రుటిలో పారిస్‌ బెర్త్‌ కోల్పోయింది. తొలి రోజు పోటీల్లో బరిలో దిగిన భారత రెజ్లర్లలో నిషా దహియా (68కి.) మాత్రమే సెమీ్‌సకు చేరలేపోయింది.

Updated Date - Apr 21 , 2024 | 03:53 AM