ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం
ABN , Publish Date - May 17 , 2024 | 02:19 AM
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్లో ప్రవేశించింది. మరోవైపు ఈ జట్టు మెరుపు ప్రదర్శనను చూడాలనుకుని తరలివచ్చిన ఫ్యాన్స్ ఉత్సాహాన్ని వరుణుడు...
నేటి మ్యాచ్
ముంబై X లఖ్నవూ, రాత్రి 7.30 గం. వేదిక: ముంబై
సన్రైజర్స్ ప్లేఆఫ్స్కు
టైటాన్స్తో మ్యాచ్ రద్దు
హైదరాబాద్: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్లో ప్రవేశించింది. మరోవైపు ఈ జట్టు మెరుపు ప్రదర్శనను చూడాలనుకుని తరలివచ్చిన ఫ్యాన్స్ ఉత్సాహాన్ని వరుణుడు నీరుగార్చాడు. గురువారం గుజరాత్ టైటాన్స్తో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. టాస్ వేయడం కూడా వీలు కాలేదు. అయితే 15 పాయింట్లతో రైజర్స్ మాత్రం బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్స్కు చేరిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం నుంచే ఎడతెరిపిలేని భారీ వర్షంతో ఉప్పల్ మైదానం తడిసిముద్దయ్యింది. గ్రౌండ్స్టాఫ్ పిచ్తో పాటు దాదాపు అంతటా కవర్లు కప్పి ఉంచారు. సాయంత్రం 6.45కు వర్షం తగ్గినట్టు కనిపించడంతో కవర్లు తీసేసినా.. కాసేపటికే దట్టమైన మేఘాలు కమ్మడంతో వాటిని యధాస్థానంలో ఉంచాల్సి వచ్చింది. ఇక రాత్రి 7.30కు పూర్తిగా తగ్గడంతో పిచ్పై కవర్ను కూడా తీసేయడంతో కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్ జరుగుతుందన్న అంచనా ఏర్పడింది. రాత్రి 8 గంటలకు టాస్ వేసేందుకు కూడా నిర్ణయించి మ్యాచ్ను 8.15కు ఆరంభించాలని చూశారు. కానీ ఆ సంబరం ఎంతో సేపు లేకుండా రాత్రి 7.50 నుంచి తిరిగి ఆరంభమైన వర్షం ఇక తెరిపినివ్వలేదు. దీంతో రాత్రి 10.11కు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
టాప్-2లో ఉండాలంటే..
ప్లేఆ్ఫ్సలో ప్రవేశించిన సన్రైజర్స్కు టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు స్థానానికి వచ్చిన ప్రమాదమేమీలేదు. ఇక కేకేఆర్పై తమ చివరి మ్యాచ్లో నెగ్గితే రాజస్థాన్ 18 పాయింట్లతో రెండో స్థానం ఖరారు చేసుకుంటుంది. అప్పుడు హైదరాబాద్ చేసేదేమీ లేదు. కానీ ఆ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోయి.. ఇటు ఎస్ఆర్హెచ్ తమ ఆఖరి మ్యాచ్లో పంజాబ్ను ఓడిస్తే 17 పాయింట్లతో టాప్-2లో ఉండొచ్చు.
టిక్కెట్ల డబ్బు వాపసు
మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో టిక్కెట్ల డబ్బును వెనక్కి ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్కు మొత్తం 33,781 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రేక్షకులు తమ టిక్కెట్లను సన్రైజర్స్ యాజమాన్యం తెలిపిన కేంద్రాల్లో ఇచ్చిన తర్వాత..బుకింగ్ ఫీజు, ఇతరత్రా పన్నులుపోను మిగతా మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
ఢిల్లీ అవుట్
లఖ్నవూకూ ఆశల్లేవ్
నాలుగో బెర్త్కు చెన్నై-ఆర్సీబీ పోటీ
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఇప్పటిదాకా సాంకేతికంగా రేసులో ఉన్న ఈ జట్టు ఉప్పల్ ఫలితంతో అధికారికంగానే ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. ఢిల్లీ 14 లీగ్ మ్యాచ్లాడి 14 పాయింట్లతోనే ఉంది. అలాగే రాహుల్ నేతృత్వంలోని లఖ్నవూ సూపర్ జెయింట్స్కు కూడా అవకాశం లేదు. వీరికి మరో మ్యాచ్ ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో ఉన్నా నెట్ రన్రేట్ దయనీయంగా ఉంది. ఎల్ఎ్సజీ చివరి లీగ్ మ్యాచ్ను గెలిచినా 14 పాయింట్లతోనే ఉంటుంది. ఈ జట్టుకన్నా చెన్నై-బెంగళూరు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో బెర్త్ తేలనుంది. శనివారం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. సీఎ్సకే 14 పాయింట్లతో, ఆర్సీబీ 12 పాయింట్లతో ఉన్నాయి. ఇందులో చెన్నై గెలిస్తే నేరుగా ప్లేఆ్ఫ్సకు వెళుతుంది. అటు ఆర్సీబీకి కేవలం గెలవడమే సరిపోదు. ఎందుకంటే డుప్లెసి సేన గెలిస్తే 14 పాయింట్లతోనే ఉంటుంది కాబట్టి వారి నెట్ రన్రేట్ చెన్నై కంటే మెరుగ్గా ఉండాల్సిందే. అంటే.. సీఎ్సకేపై 18+ రన్స్ తేడాతోనైనా గెలవాలి లేదా ఛేజింగ్ అయితే లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోపే (తొలి ఇన్నింగ్స్ స్కోరు 200 అనుకుంటే) ముగించాల్సి ఉంటుంది. అప్పుడే రెండు జట్లకు 14 పాయింట్లున్నా ఆర్సీబీ ముందుకెళుతుంది. అయితే ఈ మ్యాచ్కు కూడా వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే 15 పాయింట్లతో చెన్నై ప్లేఆ్ఫ్సకు వెళుతుంది.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్కతా 13 9 3 1 19 1.428
రాజస్థాన్ 13 8 5 0 16 0.273
హైదరాబాద్ 13 7 5 1 15 0.406
చెన్నై 13 7 6 0 14 0.528
ఢిల్లీ 14 7 7 0 14 -0.377
బెంగళూరు 13 6 7 0 12 0.387
లఖ్నవూ 13 6 7 0 12 -0.787
గుజరాత్ 14 5 7 2 12 -1.063
పంజాబ్ 13 5 8 0 10 -0.347
ముంబై 13 4 9 0 8 -0.271