అందుకే.. శ్రీశాంత్ తప్పించుకోగలిగాడు !
ABN , Publish Date - Apr 08 , 2024 | 01:31 AM
భారత క్రీడా రంగంలో అవినీతి నిరోధానికి సంబంధించి సరైన చట్టాలు లేకపోవడంవల్లే స్పాట్ ఫిక్సింగ్ కేసులో పేసర్ శ్రీశాంత్ కఠినమైన శిక్ష పడకుండా తప్పించుకున్నాడని ఢిల్లీ మాజీ పోలీసు...
![అందుకే.. శ్రీశాంత్ తప్పించుకోగలిగాడు !](https://media.andhrajyothy.com/media/2024/20240407/5_Sports_c8433cf16e.jpg)
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అవినీతి నిరోధానికి సంబంధించి సరైన చట్టాలు లేకపోవడంవల్లే స్పాట్ ఫిక్సింగ్ కేసులో పేసర్ శ్రీశాంత్ కఠినమైన శిక్ష పడకుండా తప్పించుకున్నాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్, అతడి రాజస్థాన్ రాయల్స్ సహచరులు అంకిత్ చవాన్, అజిత్ చండీలాను అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ కేసులో శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే..శ్రీశాంత్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఉన్నా..అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలని 2019లో సుప్రీంకోర్టు బీసీసీఐకి సూచించింది. దరిమిలా శ్రీశాంత్పై నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు బోర్డు కుదించింది. ఆ నిషేధం సెప్టెంబరు 2020లో ముగిసింది. ‘దురదృష్టవశాత్తు భారత క్రీడా రంగంలో లేదా క్రికెట్లో అవినీతిని అరికట్టేందుకు సరైన చట్టాలు లేవు. అందువల్లే..శ్రీశాంత్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలున్నా అతడు తప్పించుకోగలిగాడు’ అని నీరజ్ కుమార్ పేర్కొన్నారు.