Share News

పేసర్ల దన్నుతో భారత్‌ ఘనవిజయం

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:17 AM

దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు అదరగొట్టే రీతిలో ముగించింది. పూర్తిగా పేసర్లు రాజ్యమేలిన ఈ సంచలన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడంతో పాటు...

పేసర్ల దన్నుతో భారత్‌ ఘనవిజయం

  • ఈసారి బుమ్రాకు ఆరు వికెట్లు

  • మార్‌క్రమ్‌ అద్భుత శతకం వృధా

  • 1-1తో సిరీస్‌ సమం

  • దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టు

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు అదరగొట్టే రీతిలో ముగించింది. పూర్తిగా పేసర్లు రాజ్యమేలిన ఈ సంచలన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడంతో పాటు, సిరీ్‌సను 1-1తో సమం చేసింది. కేవలం ఐదు సెషన్లలోపే మ్యాచ్‌ ముగియడం విశేషం. తొలి టెస్టులో భారత్‌.. ఇన్నింగ్స్‌ 32 రన్స్‌ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. రెండో రోజు గురువారం పేసర్‌ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య జట్టు 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) కెరీర్‌లోనే చిరస్మరణీయ శతకం సాధించగా.. మిగిలిన బ్యాటర్లలో ఎల్గర్‌ (12)ది మాత్రమే అత్యధిక స్కోరు. అనంతరం ఛేదనలో భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు సాధించి గెలిచింది. జైస్వాల్‌ (28), రోహిత్‌ (16 నాటౌట్‌) రాణించారు. రబాడ, బర్గర్‌, జాన్సెన్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు సాధించాయి. సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కగా.. కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడిన ఎల్గర్‌-బుమ్రా సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచారు.

అటు బుమ్రా, ఇటు మార్‌క్రమ్‌: 62/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు తొలి సెషన్‌లోనే మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. పేసర్‌ బుమ్రా ఫుల్లర్‌, లెంగ్త్‌, షార్ట్‌ పిచ్‌ బంతులతో వణికిస్తూ కేవలం ఎనిమిది ఓవర్లలోనే నలుగురిని పెవిలియన్‌కు చేర్చాడు. ఆట ఆరంభం కాగానే బెడింగమ్‌ వికెట్‌ తీసిన బుమ్రా మరే బ్యాటర్‌ను కూడా కుదురుకోనీయలేదు. వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లడంతో జట్టు 111/7 స్కోరుతో నిలిచింది. కానీ మరో ఎండ్‌లో మార్‌క్రమ్‌ మాత్రం ఏ బౌలర్‌నూ వదలకుండా చెలరేగాడు. ఎప్పుడో ముగియాల్సిన ఆట అతడి బ్యాటింగ్‌ కారణంగానే 78 పరుగుల ఆధిక్యం వరకు వెళ్లింది. వాస్తవానికి మార్‌క్రమ్‌ 73 పరుగుల వద్దే అవుట్‌ కావాల్సి ఉన్నా కీపర్‌ రాహుల్‌ క్యాచ్‌ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రసిద్ధ్‌ ఓవర్‌లో 4,6,6,4తో 20 రన్స్‌ రాబట్టాడు. ఆ వెంటనే బుమ్రా ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో 99 బంతుల్లోనే సూపర్‌ సెంచరీని పూర్తి చేశాడు. ఈ దశలో కెప్టెన్‌ రోహిత్‌ బంతిని సిరాజ్‌కు ఇచ్చి ఫలితం సాధించాడు. 32వ ఓవర్‌లో ఆఫ్‌ స్టంప్‌ వైపు వేసిన లెంగ్త్‌ బాల్‌ను మార్‌క్రమ్‌ పుల్‌ షాట్‌ ఆడాడు. అయితే బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని బంతి గాల్లోకి లేవగా లాంగా్‌ఫలో రోహిత్‌ సులువైన క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో భారత్‌ ఎదురుచూపులు ఫలించాయి. ఆ తర్వాత రబాడ (2)ను ప్రసిద్ధ్‌, ఎన్‌గిడిని బుమ్రా అవుట్‌ చేయంతో సఫారీల పోరాటం ముగిసింది.

జైస్వాల్‌ జోరు: ఛేదించాల్సింది స్వల్ప స్కోరే అయినా.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ధాటిగా సాగింది. ఉన్నది కాసేపే అయినా ఓపెనర్‌ జైస్వాల్‌ టీ20 ఆటతీరుతో చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదగా మొత్తంగా 23 బంతుల్లో 6 ఫోర్లతో 28 రన్స్‌ సాధించి ఆరో ఓవర్‌లో వెనుదిరిగాడు. అప్పటికే జట్టు 44 రన్స్‌ సాధించింది. గిల్‌ (10)ను రబాడ బౌల్డ్‌ చేశాడు. పదో ఓవర్‌లో రోహిత్‌, కోహ్లీ (12) చెరో ఫోర్‌ సాధించారు. రోహిత్‌ క్యాచ్‌ను జోర్జి వదిలేయగా.. విజయానికి నాలుగు పరుగుల దూరంలో కోహ్లీ వెనుదిరిగాడు. అయితే శ్రేయాస్‌ (4 నాటౌట్‌) చక్కటి ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

టెస్టు చరిత్రలో తొలిసారి

సఫారీల ఖేల్‌ ఖతం

ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలడంతో మొత్తంగా రెండో టెస్టు కేవలం 106.2 ఓవర్లలోనే ముగిసింది. అదీ కేవలం ఐదు సెషన్లలోనే కావడం మరో విశేషం. ఇక 642 బంతుల్లోనే టెస్టులో ఫలితం రావడం 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే ప్రథమం. గతంలో 656 బంతుల్లో ఆసీ్‌స-దక్షిణాఫ్రికా టెస్టు, 672 బంతుల్లో విండీస్‌-ఇంగ్లండ్‌ టెస్టు, 788 బంతుల్లో ఇంగ్లండ్‌-ఆసీస్‌ టెస్టు, 792 బంతుల్లో ఇంగ్లండ్‌-ఆసీస్‌ టెస్టుల ఫలితాలు వచ్చాయి.

Updated Date - Jan 05 , 2024 | 06:17 AM