ఆర్సీబీ ఆల్రౌండ్ షో
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:51 AM
మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు చూపుతోంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆకట్టుకుని 8 వికెట్ల తేడాతో...
![ఆర్సీబీ ఆల్రౌండ్ షో](https://media.andhrajyothy.com/media/2024/20240227/5_Sports_253dcd45bb.jpg)
డబ్ల్యూపీఎల్లో నేడు
ముంబై X యూపీ రాత్రి 7.30 గం. నుంచి
వరుసగా రెండో విజయం
రాణించిన మంధాన, మేఘన
గుజరాత్తో మ్యాచ్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు చూపుతోంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆకట్టుకుని 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీకిది వరుసగా రెండో విజయం కాగా, టైటాన్స్కు రెండో ఓటమి. స్వల్ప ఛేదనలో కెప్టెన్ స్మృతి మంధాన (27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 43)తో పాటు తెలుగు బ్యాటర్ సబ్బినేని మేఘన (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 36 నాటౌట్) ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్లో హేమలత (31 నాటౌట్) మాత్రమే పోరాడినా ఫలితం లేకపోయింది. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. పేసర్ రేణుకా సింగ్ (2/14) పొదుపైన బౌలింగ్లో టాపార్డర్ పనిబట్టింది. స్పిన్నర్ మోలినెక్స్కు మూడు వికెట్లు దక్కాయి.
తొలి ఓవర్ నుంచే..
ఛేదన కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ 12.3 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ మంధాన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో బాదుడు ఆరంభించింది. నాలుగో ఓవర్లో డివైన్ (6) అవుటైనా.. మేఘన జత కలవడంతో స్కోరు మరింత వేగంగా దూసుకెళ్లింది. ఇద్దరూ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఐదు, ఎనిమిదో ఓవర్లలో మేఘన రెండేసి ఫోర్లతో జోరు చూపింది. రెండో వికెట్కు మంధానతో కలిసి 40 పరుగులు అందించిన మేఘన, 11వ ఓవర్లో 6,4తో మరింత దూకుడు కనబరిచింది. అటు ఎలిస్ పెర్రీ (14 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్) తనకు సహకారం అందించడంతో మరో 45 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది. మూడో వికెట్కు ఈ జోడీ అజేయంగా 38 రన్స్ జోడించింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 (హేమలత 31 నాటౌట్, హర్లీన్ 22; మోలినెక్స్ 3/25, రేణుకా సింగ్ 2/14); బెంగళూరు: 12.3 ఓవర్లలో 2 వికెట్లకు 110 (స్మృతి మంధాన 43, మేఘన 36 నాటౌట్, పెర్రీ 23 నాటౌట్; గార్డ్నర్ 1/15, తనూజ 1/20).