Share News

ట్రయల్స్‌లో ఫొగట్‌ రచ్చ!

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:34 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీ కోసం జరుగుతున్న మహిళల రెజ్లింగ్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆసియాడ్‌ పతక విజేత వినేష్‌ ఫొగట్‌ హంగామా సృష్టించింది.

ట్రయల్స్‌లో ఫొగట్‌ రచ్చ!

ఒకేరోజు రెండు కేటగిరీల్లో బరిలోకి..

ఆసియా క్వాలిఫయర్స్‌కు అర్హత

శాంపిల్‌ ఇవ్వకుండానే వెళ్లిన రెజ్లర్‌?

పటియాలా: పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీ కోసం జరుగుతున్న మహిళల రెజ్లింగ్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆసియాడ్‌ పతక విజేత వినేష్‌ ఫొగట్‌ హంగామా సృష్టించింది. నిబంధనలను అతిక్రమిస్తూ ఒకేరోజు రెండు వెయిట్‌ కేటగిరీలు 50, 53 కిలోల్లో బరిలోకి దిగడానికి అనుమతించాలంటూ రచ్చ చేసింది. మొత్తమ్మీద రెండింటిలో తలపడి ఒకదానిలో గెలిచి ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. సోమవారం దాదాపు రెండున్నర గంటలు ట్రయల్స్‌కు ఆటంకం కలిగించడంతో.. అధికారులు ఆమె ఒత్తిడికి తలొగ్గారు. పైగా, 53 కిలోల ట్రయల్స్‌లో ఓడినా ఒలింపిక్స్‌ ఆరంభానికి ముందు ఫైనల్‌ ట్రయల్స్‌ నిర్వహించేలా తనకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అయితే, ఫొగట్‌ను రెండు వెయిట్‌ కేటగిరీల్లో అనుమతించడంపై పలువురు రెజ్లర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసిన వారిలో వినేష్‌ ముందు వరుసలో ఉంది. వినేష్‌ సహజంగా 53 కిలోల విభాగం బరిలోకి దిగుతుంది. అయితే, ఆ కేటగిరీలో అంతిమ్‌ ఈపాటికే ఒలింపిక్‌ కోటా బెర్త్‌ సాధించడంతో ఫొగట్‌ తన వెయిట్‌ కేటగిరీని 50 కిలోలకు మార్చుకొంది. ఈ కేటగిరీలో గెల్చి వచ్చేనెల్లో జరిగే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు ఎంపికైంది. అయితే, 53కిలోల బౌట్‌లో ఫొగట్‌ చిత్తుగా ఓడింది. కాగా, ట్రయల్స్‌ ముగిశాక మూత్రం శాంపిల్‌ను ఇవ్వాల్సి ఉన్నా.. వినేశ్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయిందని సమాచారం.

Updated Date - Mar 12 , 2024 | 01:34 AM